కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 7 : ఉపాధి హామీ పథకానికి ఒకవైపు కేంద్రం నిధుల్లో ఏటా కోత విధిస్తూ వస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధిక నిధులు కేటాయించి నిరుపేదలకు భరోసానిస్తున్నది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు ధైర్యం కల్పిస్తున్నది. గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 248 కోట్లు అదనంగా ప్రకటించడం అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నది. దీంతో కూలీల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ఇక నిరంతరాయంగా పనులు కొనసాగనున్నాయనే ధీమా కనిపిస్తున్నది.
ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు పెంచాలంటూ నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా కేంద్రం మాత్రం తగ్గిస్తూ వస్తున్నది. పైగా, ప్రస్తుతం కొనసాగుతున్న పనులపైనా ఆంక్షలు విధిస్తూ, నిధుల విడుదలకు అనేక కొర్రీలు పెడుతున్నది. గతేడాది దేశవ్యాప్తంగా 86 వేల కోట్లు కేటాయిస్తే, రాష్ర్టానికి 2,498 కోట్లు ఇచ్చింది. ఈ సారి కేంద్ర బడ్జెట్లో భారీగా కోత పెట్టి కేవలం 60 వేల కోట్లకే పరిమితం చేసింది. ఈ లెక్కన రాష్ర్టానికి 1700 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నది. దీనిని బట్టి చూస్తే గతేడాది కంటే సుమారు 800 కోట్లు కోత పడనున్నది. ఈక్రమంలో ఉపాధి పనులపై కూలీలు పెట్టుకున్న ఆశలు వదులుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో 1,648 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో 1,400 కోట్లు కాగా, ఈసారి అదనపు కేటాయింపులు చేయడంతో అన్ని వర్గాలకు చెందిన కూలీల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి పాలనలో ఉపాధి కోసం వలసదారి పట్టిన కూలీలంతా స్వరాష్ట్రంలో తిరుగుదారి పట్టారు. గతంలో జిల్లా నుంచే అధిక కూలీల వలస ఉండేది. సీఎం కేసీఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల మూలంగా పుష్కలంగా నీటి నిల్వలు పెరిగి, పల్లెల్లో సాగు విస్తీర్ణం ఊహించని స్థాయికి పెరిగింది. వ్యవసాయ సీజన్లో ఆ పనులకు వెళ్తూనే, ఖాళీ సమయంలో ఉపాధి హామీ పథకంలో కొనసాగుతున్న పనులకు వెళ్తూ, తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఇక ఉపాధి పథకం నిర్వీర్యం అవుతుందనే భావనలో ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులతో కరీంనగర్ జిల్లాలోని 2,31,560 మంది కూలీల్లో సంతోషం కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ను మహిళా కూలీలు పొగడ్తలతో ముంచెత్తుతుండగా, రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కేసీఆరే పరిపాలించాలంటూ ఆకాంక్షిస్తున్నారు. ఉపాధి హామీ పనులను నిరంతరాయంగా కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించడంపై కార్మిక సంఘాల నాయకులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దేశాన్ని కూడా కేసీఆరే పాలించాలె..
పేదోళ్ల పొట్టగొట్టేందుకు మోదీ ప్రభుత్వం చూస్తంది. కూలీల కోసం తక్కువ నిధులు ఇచ్చిందట. ఉపాధి పనితోనే నేను నా కుటుంబాన్ని పోషిస్తున్న. మరికొన్ని రోజుల తర్వాత పనులుండవని అనుకున్న. అంతల్నె సీఎం కేసీఆర్ సారు సోమారం నాడు మాలాంటోళ్ల కోసం మరిన్ని ఎక్కువ నిధులు ప్రకటించి, మమ్ములను ఆదుకుంటానని చెప్పిండు. చాలా సంతోషంగా ఉన్నది. రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా కేసీఆరే పాలించాలె. మా అసోంటోళ్లను పెద్ద చేయాలె.
– నాయిని మధురమ్మ, ఉపాధి కూలీ
రాష్ట్రం అధికంగా కేటాయించడం సంతోషం
కేంద్రం నిర్వీర్యం చేస్తున్న ఉపాధిహామీ పథకాన్ని రాష్ట్రంలో పునరుద్ధరించే క్రమంలో బడ్జెట్లో అధిక నిధులు కేటాయించడం సంతోషకరం. ఈ పథకం కొనసాగింపుపై కూలీల్లో ఆందోళన నెలకొనగా, గత బడ్జెట్లో కేటాయించిన మొత్తానికి అదనంగా 248 కోట్లు కేటాయించడం శుభసూచకం. కరీంనగర్ జిల్లాలో 2 లక్షలకు పైగా ఉన్న ఉపాధి కూలీలకు మరో ఏడాది పాటు పని భద్రత లభించనుండడం సంతోషం.
– కొయ్యడ సృజన్కుమార్, బీకేఎంయూ రాష్ట్ర కార్యదర్శి