వేములవాడ, డిసెంబర్ 19: పేదలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. మూరుమూల ప్రాంతాల్లోనూ దవాఖానలను బలోపేతం చేసి, సేవలను మెరుగుపరుస్తున్నది. ఇప్పటికే అనేక రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది ఆధునిక వైద్య సదుపాయాలతో వంద పడకల వేములవాడ ఏరియా దవాఖానను ప్రారంభించి, ఆధునిక వైద్యన్ని చేరువ చేసింది. దాదాపు 2 కోట్లతో సీటీస్కాన్, 30లక్షలతో అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్, చిన్నారుల కోసం ప్రత్యేక వార్డు, మాతా శిశుసంరక్షణలో భాగంగా ప్రత్యేకవార్డు, ఇతర అనేక వైద్య సదుపాయాలను కల్పించింది.
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు చేతుల మీదుగా గతేడాది మేలో ఈ దవాఖాన అందుబాటులోకి రాగా, అరుదైన శస్త్రచికిత్సలను చేస్తున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వేగవంతంగా పనులను పూర్తి చేసి అత్యాధునిక వసతులతో సేవలందిస్తున్నారు. లక్షలాది రూపాయల విలువైన కీలక ఆపరేషన్లను కూడా పూర్తి ఉచితంగా చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో చేసే కీలు మార్పిడి, చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్సలను ఈ దవాఖానలో చేయగా, మంత్రులు హారీశ్రావు, కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ఇప్పటికే ప్రశంసించారు.
డిజిటల్ ఎక్స్రే సేవలు ప్రారంభం
ఏరియా దవాఖానలో సీటీస్కాన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ను అందుబాటులోకి తేగా, తాజాగా 20లక్షలతో డిజిటల్ ఎక్స్రేను అందుబాటులోకి తీసుకువచ్చారు. సోమవారం ఈ ఎక్స్రే సేవలను ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ప్రారంభించి మాట్లాడారు.
రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుతాయని చెప్పారు. మెరుగైన సేవలందిస్తున్న వైద్యులను అభినందించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ మధు రాజేందర్, జడ్పీటీసీలు మ్యాకల రవి, నాగం భూమయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్ రావు, వైద్యులు అనిల్కుమార్ తదితరులు ఉన్నారు.