హుజూరాబాద్టౌన్, డిసెంబర్ 3: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఈడీ, ఐటీలను పంపి మంత్రులపై దాడులకు ఉసిగొల్పుతున్నదని ఆక్షేపించారు. ఈడీ, బోడీలకు బెదిరేదిలేదని తేల్చిచెప్పారు. శనివారం హుజూరాబాద్లో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు సమస్యలపై వినతిపత్రాలు అందించారు.
ఎక్కువగా ఇండ్ల కోసమే అర్జీలు వచ్చాయని కౌశిక్రెడ్డి తెలిపారు. ప్రజాదర్బార్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. పేదల భూములను ఆక్రమించి, అక్రమ ఆస్తులు సంపాదించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈడీలకు భయపడే బీజేపీలో చేరాడని ఆరోపించారు. ఈరోజు షర్మిల, కేఏ పాల్ ఇద్దరు ఒకటేనని, తెలంగాణలో ఉన్న అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికే పాదయాత్ర పేరిట ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్పై ప్రతిపక్ష పార్టీల నాయకులు పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ సర్కారుకు ఢోకాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, తహసీల్దార్ కోమల్రెడ్డి, కమిషనర్ ఎస్ సమ్మయ్య, కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్రెడ్డి, అపరాజ ముత్యంరాజు, ప్రతాప మంజులకృష్ణ, మకపల్లి కుమార్యాదవ్, గనిశెట్టి ఉమామహేశ్వర్, తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్కుమార్ ఉన్నారు.