ధర్మపురి వేదభూమి, పుణ్యభూమి. అలాంటి ప్రాంతంలోని ఆలయం ఎదుట గతంలో కొంత ఇరుకైన పరిస్థితి ఉండేది. అది చూసినప్పుడల్లా బాధ కలిగేది. కానీ, స్వరాష్ట్రంలో ఆలయం ఎదుట విస్తరణ పనులు చేపడుతుండడం సంతోషంగా ఉన్నది. నర్సన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నా. ధర్మపురి స్ఫూర్తిగా వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోలాట పోటీలు నిర్వహిస్తాం. మహిళల్లోని సృజనాత్మకత బతుకమ్మ వేడుకల సమయంలో ప్రపంచం ముందు ఆవిష్కృతమవుతుంది. సింగరేణి కార్మికుడి నుంచి మొదలుకొని ఉద్యమ ప్రస్థానం వరకు ఈశ్వర్ గొప్ప సంస్కరణవాదిగా పనిచేశారు. టీఆర్ఎస్కు కొప్పుల ఈశ్వర్ గొప్ప ఎసెట్. ఆయనను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.
– బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
జగిత్యాల, సెప్టెంబర్ 29, (నమస్తే తెలంగాణ) : ధర్మపురి వేదభూమి, పుణ్యభూమి అని, అలాంటి క్షేత్రంలో ఆలయం ముందు ప్రాంతం గతంలో కొంత ఇరుకైన పరిస్థితి ఉండేదని, రాష్ట్ర అవతరణ తర్వాత విస్తరణ పనులు చేపడుతుండడం సంతోషంగా ఉన్నదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ధర్మపురి నర్సన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మహిళా విభాగం, ఎల్ఎం కొప్పుల ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ, దసరా కోలాట పోటీల ముగింపు, బతుకమ్మ వేడుకలను జగిత్యాల జిల్లా ధర్మపురి జూనియర్ కాలేజీ మైదానంలో గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సంబురాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల కేరింతలు, కోలాటాల మధ్య సంబురాలు అంగరంగ వైభవంగా సాగాయి. సభలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ,. ధర్మపురి పట్టణంలో నిర్వహించిన కోలాట పోటీలు, బతుకమ్మ ఆటపాటలు మహిళల్లోని సృజనాత్మకత, దృఢ సంకల్పం, లలిత కళలు వెల్లివిరిశాయన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో నిర్వహించిన బతుకమ్మ, దసరా కోలాట పోటీలను స్ఫూర్తిగా తీసుకొని, వచ్చే ఏడాది దసరా నవరాత్రోత్సవాల్లో రాష్ట్ర స్థాయి పోటీలను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రకటించారు. మనిషిలో మంచితనం, వినయం ఉంటే అవి బంగారు భవిష్యత్తుకు, ఉన్నత స్థాయికి చేరేందుకు సహకరిస్తాయన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ వినయం, సౌ మ్యత ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. ఆయన ఉన్నతికి అవి దోహదం చేశాయన్నారు. ధర్మపురి పట్టణాభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.150 కోట్ల నిధులు మంజూరు చేశారని, సీఎం కేసీఆర్కు రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిపై సమానమైన అభిమానం ఉందన్నారు. ప్రతి అంగుళం బంగారుమయం కావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు.
స్వరాష్ట్రంలో పండుగలకు సముచిత స్థానం : మంత్రి కొప్పుల ఈశ్వర్
ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాతనే తెలంగాణ పండుగలకు, పర్వదినాలకు సముచిత స్థానం దక్కుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, పండుగలు, పర్వదినాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వాటికి విశ్వవ్యాప్త గుర్తింపును తీసుకువస్తున్నారని చెప్పారు. ఉద్యమ సమయంలో బతుకమ్మ పూలను ఉద్యమ నిప్పురవ్వలుగా మార్చి, తెలంగాణ పోరాట స్ఫూర్తిని, బతుకమ్మ పండుగ ప్రశస్తిని విశ్వవాప్తం చేసిన జాగృతి అధ్యక్షురాలు ధర్మపురిలో బతుకమ్మ వేడుకలకు హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. మహానాయకుడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం గమ్యాన్ని ముద్దాడిందన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎనిమిదేండ్ల వ్యవధిలో ఒక్కో సమస్య పరిష్కారమై తెలంగాణ దేశంలోనే మోడల్ రాష్ట్రంగా అవతరించిందన్నారు. మోదీ పాలనపై దేశ ప్రజలు విసిగి, వేసారి పోయారని విమర్శించారు. కనీసం ఒక్క సమస్యనైనా పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం సఫలం కాలేదన్నారు. సాగునీటి, రైతుల, కరెంట్ సమస్యలేవీ పరిష్కారమవ్వలేదని తెలిపారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు దేశ హద్దులు దాటి విశ్వవ్యాప్తం అయ్యాయన్నారు. ఇక్కడి అభివృద్ధి తమకు కావాలన్న ఆలోచన, డిమాండ్ దేశ ప్రజల్లో మొదలైందని, దాని ఫలితంగానే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, దేశానికి మార్గదర్శనం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. “సీఎం కేసీఆర్ ఆగే బడో.. హమ్ సాథ్ హై” అనే నినాదం బయలుదేరిందన్నారు. ముఖ్యమంత్రి అడుగులో అడుగువేసి ఆయన బాటలో నడవాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్మపురిలో కేసీఆర్ యాగం చేశారని, దాని స్ఫూర్తితో తెలంగాణ సాధించిన తర్వాత క్షేత్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి సహకరించారని వివరించారు. ధర్మపురి పట్టణానికి రూ.150 కోట్ల నిధులను మంజూరు చేశారన్నారు. ధర్మపురిని మున్సిపాలిటీగా మార్చడంతో పట్టణ రూపురేఖలు మారిపోయాయన్నారు.
టీఆర్ఎస్ మహిళా విభాగం, ఎల్ఎం కొప్పుల ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట పోటీలకు, బతుకమ్మ సంబురాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి ఈశ్వర్ ధన్యవాదాలు తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగిన కోలాట పోటీల్లో విజేతలుగా నిలిచిన మూడు జట్లకు నగదు బహుమతులను మంత్రి, ఎమ్మెల్సీ అందజేశారు. సమావేశం అనంతరం జూనియర్ కాలేజీ మైదానంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమాల్లో కోరుట్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా శాఖ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ వొద్దినేని హరి చరణ్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్ పాల్గొన్నారు.