వీణవంక, డిసెంబర్ 5: ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తన స్వగ్రామం వీణవంకలో సోమవారం స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. పొద్దున్నే వాడవాడలా తిరుగుతూ సీసీరోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులను ఆప్యాయంగా పలుకరించారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. పలువురు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, ఓపికతో విన్నారు. గ్రామంలో అవసరమైన సౌకర్యాల గురించి ప్రజలను అడిగి, వివరాలు నమోదు చేసుకున్నారు. మహిళలు మహిళా సంఘ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించారు.
అనంతరం వైకుంఠధామాన్ని పరిశీలించి, అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలోనే వీణవంకను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ నీల కుమారస్వామి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, ఉపసర్పంచ్ వోరెం భానుచందర్, వార్డు సభ్యులు భిక్షపతి, మహేందర్, గొడుగు రాజు, రాయిశెటి సంపత్, రాజు, నాయకులు నీల పున్నం, క్రాంతి, నీల శ్రీకాంత్, రవి, కృష్ణచైతన్య, రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.