కార్యకర్తలే బీఆర్ఎస్కు పునాదిరాళ్లని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ అభివర్ణించారు. నాయకులు, కార్యకర్తల మధ్య బంధం బలోపేతానికే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సైదాపూర్ మండలంలోని గొడిశాలలో 13 గ్రామాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
సైదాపూర్, మార్చి 25 : సీఎం కేసీఆరే దేశానికి శ్రీరామ రక్ష అని, బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ స్పష్టం చేశారు. కార్యకర్తలే పార్టీకి పునాది అని, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో బీఆర్ఎస్ ప్రజానికానికి అండగా ఉంటుందన్నారు. సైదాపూర్ మండలంలోని గొడిశాల గ్రామంలో 13 గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమ్మేళనానికి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. ఆత్మీయ సమ్మేళనాలతో నాయకులు, కార్యకర్తల మధ్య సంబంధం బలోపేతమవుతుందన్నారు. గత ఎనిమిదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతుంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసరపు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత సైదాపూర్ మండలానికి ఏం నిధులు తీసుకువచ్చారని ప్రశ్నించారు.
మండలానికి కాళేశ్వరం జలాలను తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రెండు సార్లు బీఆర్ఎస్ విజయం సాధించినట్లుగానే రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్పకుండా ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తూ విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడూ కార్యకర్తలు, నాయకులు సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులను గ్రామస్థాయిలో ఇంటింటికీ తెలుపాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నదని చెప్పారు. సైదాపూర్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి దశల వారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. అంతర్గత రహదారులతో పాటు సైదాపూర్ నుంచి ఘనపూర్ బీటీ రోడ్డు, ఎలబోతారం నుంచి అమ్మనగుర్తి బీటీ రోడ్డుతో పాటు ఆరెపల్లి, గెర్రెపల్లి గ్రామాల బీటీరోడ్లకు నిధులు కేటాయించామని, త్వరలోనే పనులు జరుగుతాయన్నారు. అన్ని తండాల అభివృద్ధిపై దృష్టిపెట్టామని, త్వరలో 48 కోట్లతో ప్రతితండాకు రహదారి సౌకర్యం కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్ల వెంకటరెడ్డి, సర్పంచ్లపోరం మండలాధ్యక్షుడు చంద శ్రీనివాస్, సర్పంచ్లు చింత లతాకుమారస్వామి, కాయిత రాములు, మిడిదొడ్డి సరిత, కం దుల విజయ, గుండేటి సునీతరాణి జయకృష్ణ, కొత్త రాజిరెడ్డి, ఆవునూరి పాపయ్య, బత్తుల కొంరయ్య, ఎంపీటీసీలు గాజర్ల భాగ్య, బీఆర్ఎస్ నాయకులు ముత్యాల వీరారెడ్డి, ఎల్కపల్లి రవీందర్, కంది రవీందర్రెడ్డి, జున్నూతుల భాస్కర్రెడ్డి, ఓరుగంటి దేవేంద్ర ఉన్నారు.
కార్యకర్తలే పార్టీకి బలం
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగింది. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయిలో వెళ్లి వివరించాలి. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుపాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నది. రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, పల్లె ప్రగతి వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.
– కనుమల్ల విజయ, జడ్పీ చైర్ పర్సన్
చార్జిషీట్ పేరుతో దుష్ప్రచారం
ఇటీవల జరిగిన కాంగ్రెస్ యాత్రలో రేవంత్రెడ్డి హుస్నాబాద్ ఎమ్మెల్యేపై చార్జిషీట్ విడుదల చేయడం హాస్యాస్పదం. ఎమ్మెల్యేపై చేసిన అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదు. ఆయనకున్న మంచి లక్షణాలు ఒక్కటైనా రేవంత్రెడ్డికున్నాయా..? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వొడితల సతీశ్కుమార్ గురించి ఇష్టమున్నట్లు మాట్లాడితే ప్రజలు తగిన సమాధానం చెబుతరు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఓటుకు నోటు ద్వారా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి జైలుపాలైంది రేవంత్రెడ్డి కాదా..? కరీనంగర్ ఎంపీ బండి సంజయ్ విద్వేషాలను రెచ్చగొట్టడమే తప్ప చేసే అభివృద్ధి ఏమీ ఉండదు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని విమర్శిస్తున్న సంజయ్ కేంద్రం నుంచి ఏమైనా నిధులు తీసుకువచ్చాడో చెప్పాలి.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
యువత కీలక పాత్రపోషించాలి
రానున్నది ఎన్నికల సంవత్సరం. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించడంలో యువత కీలకపాత్ర పోషించాలి. ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా చేసే ప్రచారానికి తగిన జవాబు ఇవ్వాలి. ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ చేసిన పనుల గురించి ప్రజలకు వివరించాలి. గ్రామాల వారీగా బీఆర్ఎస్ పటిష్టంగా ఉన్నది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి. వచ్చే ఎన్నికల్లో మండలం నుంచి అత్యధిక మెజార్టీ వచ్చే విదంగా ప్రతి కార్యకర్తా కష్టపడాలి.
– వొడితల ఇంద్రనీల్బాబు, బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకుడు
ప్రతి కార్యకర్తకూ న్యాయం
బీఆర్ఎస్లో ప్రతి కార్యకర్తకూ న్యాయం జరుగుతుంది. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి. ప్రతి ఒక్కరికీ పార్టీ గుర్తింపు ఉంటుంది. బీఆర్ఎస్పై ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలకు మనం తగిన రీతిలో సమాధానం ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలి. ప్రతి కార్యకర్తా తన బాధ్యతగా తీసుకుని రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పనిచేయాలి.
– పొన్నం అనిల్గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
అన్ని వర్గాల వారికి న్యాయం
ప్రభుత్వ పాలనలో మా గ్రామంలో అందరికీ న్యాయం జరుగుతున్నది. రైతుబంధు, రైతు బీమాతో పాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతుతో పటిష్టంగా అయ్యాయి. ప్రభుత్వం చేసిన పనులను అందరికీ చెబుతున్నాం.
– కంది రవీందర్రెడ్డి, గొడిశాల
పాలన బాగున్నది
తెలంగాణ వచ్చిన తర్వాత మా గ్రామంలో అభివృద్ధి జరిగింది. పల్లెప్రగతిలో భాగంగా ట్రాక్టర్ ద్వారా చెత్తసేకరిస్తున్నారు. వైకుంఠ ధామాలు ఏర్పాటయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలన బాగున్నది. ప్రభుత్వం చేసిన పనుల వల్ల అందిరికీ న్యాయం జరుగుతున్నది.
– జున్నూతుల భాస్కర్రెడ్డి, గొడిశాల