‘కరువు కాటకాలతో తండ్లాడిన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాం. ఇప్పటి వరకు 7వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేశాం. గడపగడపకూ సంక్షేమ పథకాలను అందించాం’ అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థిగా అధినేత కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ సహకారంతో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లను 95శాతం వరకు పూర్తిచేశామని చెప్పారు. గౌరవెల్లి రిజర్వాయర్ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇటీవలే ట్రయల్ రన్ చేశామని, త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పాలన చేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలకు మళ్లీ సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను గెలిస్తే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా సమపాళ్లలో అభివృద్ధి చేస్తానని, మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, అందుకోసం వివిధ రకాల పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పారు.
– హుస్నాబాద్, ఆగస్టు 29
హుస్నాబాద్, ఆగస్టు 29 : నిస్వార్థ సేవతో ముందుకెళ్తూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసులను దోచుకున్నారు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ఇంటింటికీ చేర్చారు. ఇప్పటివరకు 7వేల కోట్లకుపైగా నిధులతో పనులు చేపట్టి, నియోజకవర్గాన్ని అన్నింటా ఆదర్శంగా నిలిపారు. నాడు కరువుకాటకాలతో తండ్లాడిన మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. తొమ్మిదేండ్లలో రోడ్లు, భవనాలు, తాగునీరు, సాగునీటి సౌకర్యం, పాలనను ప్రజల వద్దకే తేవడం, గిరిజన తండాల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు ప్రభుత్వ ఫలాలను అందజేయడంలో ముందుండి పనిచేశారు. ఇటీవల మరోసారి హుస్నాబాద్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా అధినేత కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా ఆయన, ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తొమ్మిదేండ్లలో నియోజకవర్గానికి చేసిన సేవలు, అభివృద్ధిని వివరించారు. ఆయన మాటల్లోనే..
వొడితల సతీశ్కుమార్: గౌరవెల్లి రిజర్వాయర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇటీవల ట్రయల్ రన్లో నీటిని కూడా ఎత్తిపోశాం. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఐదు దశాబ్దాలుగా వరద కాల్వ కోసం పోరాటాలు చేసిన ఈ ప్రాంత ప్రజల కలలను సీఎం కేసీఆర్ కేవలం ఎనిమిదేండ్లలో నిజం చేశారు. కుర్చీ వేసుకొని కూర్చొని రిజర్వాయర్ పూర్తి చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న ఘనత ఆయనదే. ఇందులో 8.23 టీఎంసీల నీళ్లు నింపితే నియోజకవర్గంలోని 1.06లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. ఒకవైపు దేవాదులతో భీమదేవరపల్లి మండలం, మరోవైపు మిడ్మానేరుతో చిగురుమామిడి మండలం, ఇంకోవైపు కాకతీయ కాలువతో ఎల్కతుర్తి మండలానికి ఇప్పటికే సాగునీరు అందుతున్నది. గౌరవెల్లితో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు త్వరలోనే సాగునీరందుతుంది. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే పంటలు పండించడంలో హుస్నాబాద్ నియోజకవర్గం ప్రథమస్థానంలో నిలబడుతుందనే నమ్మకం ఉన్నది. ప్రతి మండలంలో ప్రతి పంటకూ 2లక్షల క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నాయంటే కరువు పోయినట్లే కదా..!
సతీశ్కుమార్: నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశాం. ఆర్డీవో కేంద్రంగా మార్చాం. నగర పంచాయతీగా ఉన్న పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చాం. దీంతో పట్టణ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ పట్టణ అభివృద్ధి కోసం అడగ్గానే సుమారు 55కోట్లకుపైగా నిధులు మంజూరు చేశారు. 30కోట్లతో పట్టణంలో సీసీ, డ్రైనేజీల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించాం. ఇటీవల మరో 25కోట్ల నిధులు వచ్చాయి. వీటితో పట్టణంలో వందశాతం అభివృద్ధి పనులు చేపడతాం. పట్టణానికి రెండుసార్లు జాతీయస్థాయి అవార్డులు వచ్చాయి. నాతోపాటు పాలకవర్గం, అధికారులు చేసిన కృషికి ఇది నిదర్శనం. సకల హంగులతో ఐవోసీ భవన నిర్మాణం పూర్తవుతున్నది. త్వరలో మంత్రితో ప్రారంభిస్తాం. హరితహారంతో పచ్చదనాన్ని తెచ్చి పట్టణాన్ని పరిశుభ్రతంగా మార్చి వ్యాధులను దూరం చేస్తున్నం.
సతీశ్కుమార్: 2014కు ముందు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఇక్కడి కరువు పరిస్థితులను కండ్లరా చూశా. ప్రజలు పడుతున్న బాధలను గమనించా. అధినేత కేసీఆర్ పోరాటం వల్ల తెచ్చుకున్న రాష్ట్రంలో ఆయన సూచనలను నేను 2014లో ఎమ్మెల్యే అయినంకా పాటించా. హుస్నాబాద్ ప్రాంత పరిస్థితులు సీఎం కేసీఆర్కు కూడా తెలుసు. అందుకే నియోజకవర్గ అవసరాల గురించి చెప్పిన ప్రతి సారి ఆయన స్పందించేవారు. గౌరవెల్లి లాంటి రిజర్వాయర్ను పూర్తి చేయించారు. మహాసముద్రంగండి, శనిగరం, సింగరాయ ప్రాజెక్టుల మరమ్మతులు చేయించారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ సహకారంతో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లను 95శాతం వరకు పూర్తి చేశాం. మిషన్ కాకతీయతో 456 చెరువులను మరమ్మతులు చేయించాం. 13 చెక్డ్యామ్లు నిర్మించాం. 16 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం జరిగింది. లోవోల్టేజీ సమస్య అనేది నియోజకవర్గంలో లేదు.
సతీశ్కుమార్: నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉచిత కోచింగ్ సెంటర్లను నా సొంత డబ్బులతో నిర్వహించాం. ఉచిత శిక్షణ, భోజనంతో నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి యువతీయువకులు సెంటర్కు వచ్చేలా ఏర్పాట్లు చేశాం. ఆర్మీ కమ్ పోలీస్ ఉద్యోగాల్లో నియోజకవర్గం నుంచి ఎక్కువగా నియామకం కావాలనే లక్ష్యంతో సుమారు వెయ్యిమందికి మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇప్పించాం. చాలామంది యువతీ యువకులు ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంటులో ఉద్యోగాలు సాధించారు. గ్రూప్స్, డీఎస్స్సీ లాంటి పోటీ పరీక్షల కోచింగ్కు దూరప్రాంతాలకు వెళ్లి ఫీజులు చెల్లించే స్థోమత లేని విద్యార్థుల కోసం రెండుసార్లు నాలుగు నెలలపాటు కార్పొరేట్ స్థాయి ఫ్యాకల్టీలతో ఉచిత కోచింగ్ ఇప్పించాం. సుమారు 2వేలకు పైగా కళాశాల విద్యార్థులకు సొంత ఖర్చులతో ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాం. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, మోడల్ కళాశాల విద్యార్థులందరూ ప్రయోజనం పొందారు. మంచి ఫలితాలను సాధించారు.
సతీశ్కుమార్: విద్య, వైద్యంపై మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించాం. ముఖ్యంగా హుస్నాబాద్ పట్టణంలోని సర్కారు దవాఖాన సౌకర్యాలలేమితో ఉండేది. 2014 తర్వాత అదనపు భవనం నిర్మించాం. పీహెచ్సీగా ఉన్న దానిని సీహెచ్సీగా మార్చడంతో వైద్యసేవలు పెరిగాయి. అన్ని రకాల వైద్యసేవలు ఇక్కడే అందుతున్నాయి. ఒకప్పుడు గర్భిణులను కరీంనగర్, వరంగల్ నగరాలకు తీసుకెళ్లే వారు. కానీ, అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అన్ని రకాల ఆపరేషన్లు, సిజేరియన్లు ఈ దవాఖానల్లోనే జరుగుతున్నాయి. ఇటీవల ఆరోగ్యశాఖమంత్రి హరీశ్రావు మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా మంజూరు చేశారు. 7.50కోట్లతో నిర్మిస్తున్న భవనం పూర్తికావస్తున్నది. త్వరలోనే జిల్లా కేంద్రంలోని దవాఖానకు దీటుగా ఇక్కడ వైద్యసేవలందనున్నాయి. మంత్రి సహకారంతో డయాలసిస్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశాం. కిడ్నీ రోగులకు వరంగా మారింది. అన్ని మండలాల్లోని పీహెచ్సీలు, బస్తీ, పల్లె దవాఖానల్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. అలాగే మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలను సైతం ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో హుస్నాబాద్ విద్యాకేంద్రంగా మారబోతున్నది.
సతీశ్కుమార్: సీఎం కేసీఆర్ మూడోసారి కూడా బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం ఆనందంగా ఉంది. నా సేవలకు ఇది గుర్తింపుగా భావిస్తున్నా. నియోజకవర్గంలోని యువతకు ఉపాధికల్పనే ధ్యేయంగా పనిచేస్తా. ఇప్పటికే చిగురుమామిడి మండలంలోని ఓగులాపూర్ భూములు, భీమదేవరపల్లి మండలం వంగర సమీపంలోని భూములను ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించాం. ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతోపాటు వివిధ రకాల పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తా. ప్రభుత్వ ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువతీయువకులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపాధి కల్పిస్తాం. గౌరవెల్లితో ప్రతి గజానికీ సాగునీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా. మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మంజూరు చేయించి విద్యాకేంద్రంగా మార్చుతా. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా సమపాళ్లలో అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తా. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తా. ప్రజావసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా.