కరీంనగర్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)/చొప్పదండి : తెలంగాణ రాక ముందు చొప్పదండి పరిస్థితి దారుణంగా ఉండేది. సాగునీటి వసతి లేక దశాబ్దాల పాటు కరువుతో తండ్లాడింది. ఎక్కడ చూసినా భూములు బీళ్లుగా దర్శనమిచ్చేవి. తాగునీటికీ ఇబ్బంది ఉండేది. ఎప్పుడు కరువు మండలాల జాబితాను ప్రకటించినా అందులో ఈ నియోజకవర్గంలోని మండలాల పేర్లు తప్పకుండా ఉండేవి. అభివృద్ధిలోనూ వెనుకబడి ఉండేది. రోడ్లు అధ్వానంగా కనపించేవి. అయినా, నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృషితో చొప్పదండి నియోజకవర్గం ప్రగతివైపు పరుగులు తీసింది. 1,800 కోట్లతో అభివృద్ధి జరిగింది. మరోవైపు నాడు కరువుతో తండ్లాడిన ఈ నియోజకవర్గం, నేడు కోనసీమలా మారింది.
నాటి ఉమ్మడి రాష్ట్రంలో మెట్ట ప్రాంతమైన చొప్పదండి నియోజకవర్గం కరువుతో అల్లాడింది. గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ను నింపితే ఆరు మండలాలను సస్యశ్యామలం చేసే అవకాశమున్నా వివక్ష కొనసాగింది. ఫలితంగా చుక్కనీరు లేక రైతులు తమ భూములను బీళ్లుగా ఉంచాల్సి వచ్చింది. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో 2017లో నారాయణపూర్ రిజర్వాయర్ అందుబాటులోకి వచ్చింది. 28 కోట్ల నిధులతో ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్ వరకు దెబ్బతిన్న పైప్లైన్ను పునరుద్ధరించి, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తరలించడంతో ఎడారిని తలపించిన నారాయణపూర్ జలాశయం నిండుకుండలా మారింది.
దీంతో చొప్పదండి నియోజకవర్గంలోని 77 చెరువులను ప్రతి సీజన్లో నింపుతుండడంతో చొప్పదండి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల, మల్యాల, బోయినపల్లి మండలాల పరిధిలో 67,500 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. అలాగే, 17.37 కోట్లతో నారాయణపూర్ రిజర్వాయర్, 13.48 కోట్లతో పోతారం రిజర్వాయర్ను ప్రభుత్వం ఆధునీకరించింది. ఫలితంగా 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతున్నది. రామడుగు మండలంలోని మోతె ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఇదే వాగుపై ఓటీల నిర్మాణానికి 241 కోట్లు, వరద కాలువ ఓటీల నిర్మాణానికి 248 కోట్లు మంజూరు చేసింది. అలాగే, 37.19 కోట్లతో నియోజకవర్గంలో 18 చెక్ డ్యాంలు నిర్మించడంతో చొప్పదండి నియోజకవర్గం ఇప్పుడు పచ్చని పంటలతో మరో కోన సీమను తలపిస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు చొప్పదండి నియోజకవర్గం కీలకంగా మారింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రామడుగు మండలం లక్ష్మీపూర్, వెంకట్రావుపల్లె శివారులో సుమారు 5 వేల కోట్లతో గాయత్రీ పంప్హౌస్ను నిర్మించారు. ఇక్కడి నుంచే ఎగువ ఎస్సారెస్పీకి, దిగువ శ్రీరాజరాజేశ్వర జలాయానికి తరలిస్తున్నారు. ఇదే సమయంలో కాళేశ్వర జలాలతో మండలంలోని చాలా చెరువులు, కుంటలను నింపుతున్నారు. దీంతో పంప్ హౌస్ చుట్టు పక్కల అనేక గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి సాగుగోస తీరింది. పంటల సాగు విస్తీర్ణం కూడా భారీగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని గాయత్రీ పంప్హౌస్ రాష్ర్టానికే కీలకంగా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బాహుబలి పంపులు ప్రపంచంలోనే అతి పెద్దవిగా రికార్డు సృష్టించాయి.
రాష్ట్రం రాక ముందు రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేది. గుంతలు, మట్టిదారులపై దారులపై ప్రయాణం నరకం కనిపించేది. రామడుగు మండలం నుంచి కరీంనగర్ వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడేది. నియోజకవర్గం మొత్తం ఇలాంటి పరిస్థితే ఉండేది. అప్పుడు రోడ్ల మరమ్మతుల చేయించాలని మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం వందలాది కోట్ల నిధులతో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచింది. గోపాల్రావుపేట వరకు డబుల్ రోడ్డు వేసింది. గంగాధర, మధురానగర్ మధ్య 4 కోట్లతో డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, చొప్పదండి నుంచి రామడుగు వరకు మరో రోడ్డు ప్రగతిలో ఉంది. గుమ్లాపూర్ రోడ్డు నుంచి మల్లన్నపల్లి, కాట్నపల్లి వరకు మరో రోడ్డు పూర్తయింది.
చాకుంట ఎక్స్ రోడ్ నుంచి ఇదే గ్రామం వరకు, అలాగే బూరుగుపల్లి నుంచి కొండయ్యపల్లి వరకు మరో రోడ్డు పనులు పూర్తయ్యాయి. మొత్తంగా నియోజకవర్గంలో ఆర్అండ్బీ ద్వారా రోడ్ల నిర్మాణానికి 142 కోట్లు, వంతెన నిర్మాణానికి మరో 28 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రోడ్ల కోసం 106.68 కోట్లు ఖర్చు చేసి, అన్ని గ్రామాలకు సౌకర్యవంతమైన రోడ్లు నిర్మించింది. అలాగే నియోజకవర్గంలోని అన్ని రహదారులకు బీటీ రెన్నోవేషన్ పనుల కోసం నిధులు మంజూరయ్యాయి. గంగాధర మండలం వెంకటయ్యపల్లి వద్ద నిర్మించిన వంతెన అనేక గ్రామాలకు వారధిగా నిలిచింది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న దర్శనం కోసం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా ప్రతి రోజు వందలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ కనీస సౌకర్యాలు లేక పోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. శతాబ్ధాల చరిత్ర ఉన్న ఈ ఆలయ అభివృద్ధిపై నాటి పాలకులెవరూ దృష్టి పెట్టలేదు. కానీ, నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొండగట్టును కూడా భవ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 100 కోట్లు మంజూరు చేసింది. సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రానికి వచ్చి పనులు కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి మరో 500 కోట్లు మంజూరు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. అందుకోసం స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎంతో కృషి చేశారు.
అభివృద్ధిలో వెనుకబడిన చొప్పదండిపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రత్యేక దృష్టి సారించారు. 67.10 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 33 కోట్లతో గుమ్లాపూర్ చౌరస్తా నుంచి జవహర్ నవోదయ విద్యాలయం వరకు 4 కిలోమీటర్ల సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు చేస్తున్నారు.
గంగాధరలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను, మహాత్యాజ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాలను, బూరుగుపల్లిలో మరో రెసిడెన్షియల్, చొప్పదండిలో సైనిక్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ‘మన ఊరు-మన బడి’ కింద అనేక పాఠశాలలను అభివృద్ధి చేశారు.
కొత్తగా కాట్నపల్లి, కోట్లనర్సింహులపల్లిలో 33/11 విద్యుత్తు ఉప కేంద్రాలను ఏర్పాటు చేశారు. గంగాధర మండలం ఒద్యారంలో, కొడిమ్యాల, బోయినపల్లి మండలాల్లో మరిన్ని విద్యుత్తు ఉప కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు.
చొప్పదండిలో 30 పడకల దవాఖానను ప్రారంభించారు. 30 లక్షల వ్యయంతో కొడిమ్యాల, మల్యాల పీహెచ్సీల్లో సౌకర్యాలు మెరుగు పర్చారు. 54 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశారు. గంగాధర, చొప్పదండి పీహెచ్సీలను బలోపేతం చేశారు. చొప్పదండి పీహెచ్సీని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మారుస్తున్నారు. అంతే కాకుండా గంగాధర పీహెచ్సీలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు.