ఆపత్కాలంలో వర్షభాధితులకు ప్రజాప్రతినిధులు, అధికారులు కొండంత భరోసానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, అధైర్య పడొద్దని, ఏ కష్టమొచ్చినా ఆదుకుంటామని అభయమిచ్చారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, పునరావాస, సహాయక చర్యలు చేపడుతూనే మరోవైపు నష్టం అంచనాలో తలమునకలయ్యారు. దెబ్బతిన్న పంటలు, రోడ్లు, కల్వర్టులు, వంతెనలు, చెరువు గండ్లను పరిశీలిస్తూనే ఎక్కడికక్కడ మరమ్మతులు చేస్తున్నారు. విద్యుత్, రవాణాను పునరుద్ధరిస్తున్నారు. శనివారం శంకరపట్నం, వీణవంకలో కల్వల ప్రాజెక్టు, దెబ్బతిన్న రోడ్లను మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్కుమార్తో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ పరిశీలించారు. వాగులో గల్లంతై నవాబుపేటకు చెందిన రాజయ్య మృతి చెందగా, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాయికల్ మండలంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత వేర్వేరుగా పరిశీలించి, వర్ష బాధితులను ఓదార్చి ధైర్యమిచ్చారు.
– రాజన్న సిరిసిల్ల, జూలై 29(నమస్తే తెలంగాణ)
వారం రోజులుగా గెరువు లేకుండా ఏకధాటిగా వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, నష్టం భారీగానే జరిగింది. పలువురి ఇండ్లు కూలిపోయాయి. పంటలూ దెబ్బతిన్నాయి. రోడ్లు, కల్వర్టులు, వంతెనలు దెబ్బతినడంతోపాటు చెరువులకు గండ్లు పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు ప్రజాప్రతినిధులు ‘మేమున్నా’మనే భరోసానిస్తున్నారు. మూడు నాలుగు రోజులుగా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, అధికారులతో కలిసి ముమ్మరంగా రక్షణ, పునరావాస, సహాయక చర్యలు చేపడుతున్నారు. నేరుగా బాధితులను కలుస్తూ.. సర్కారు ఆదుకుంటుందని చెబుతూ అభయమిస్తున్నారు. అధైర్య పడొద్దని ధైర్యం చెబుతున్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా శంకరపట్నం మండలం కల్వల గ్రామంలోని ప్రాజెక్టును మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, మానకొండూర్, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్ కుమార్తో కలిసి పరిశీలించారు. గండి పడడం బాధాకరమని, ఈ ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సరికొత్త ప్రాజెక్టును పునర్నిర్మిస్తామని చెప్పారు. అనంతరం వీణవంక మండలంలోని ఘన్ముక్ల, మల్లారెడ్డిపల్లిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. వాగులో గల్లంతై మృతి చెందిన చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన ఏడెల్లి రాజయ్య మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకురాగా, ఎమ్మెల్యే సతీశ్ కుమార్తో కలిసి అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
జనంలోనే యంత్రాంగం
వర్షాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. జనంతో మమేకమై రక్షణ, పునరావాస, సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నష్టం అంచనా వేసే పనిలో తలమునకలయ్యారు. దెబ్బతిన్న పంటలు, రోడ్లు, కల్వర్టులు, వంతెనలు, చెరువుల గండ్లను పరిశీలించడంతోపాటు వేగంగా తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. రవాణాతోపాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ధర్మారం మండలం కొత్తూర్లో జ్వర సర్వే చేశారు. మరోవైపు అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి గ్రామంలోనూ పారిశుధ్య పనులు చేపడుతున్నారు. మురుగు కాలువలు శుభ్రం చేయించడంతోపాటు వాటర్ ట్యాంకులు, మంచినీటి బావుల్లో క్లోరినేషన్ చేస్తున్నారు. దోమలు వృద్ధి చెందకుండా బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉన్న నీటిలో గంబూషియా చేపలు, ఆయిల్ బాల్స్ వేస్తున్నారు. వరదతో కొట్టుకొచ్చిన చెత్తాచెదారాన్ని క్లీన్ చేస్తున్నారు. బురదమయంగా మారిన ప్రాంతాల్లో చెత్తను తొలగించడంతోపాటు బ్లీచింగ్ పౌడర్ వేశారు.