గంగాధర, నవంబర్ 29: ‘ప్రజలే నా బలం.. బలగం. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఓటేసి గెలిపిస్తే చివరి శ్వాస వరకు ప్రజా సేవ చేస్తా. చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు’ అని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రవిశంకర్ పేర్కొన్నారు. బుధవారం దీక్షా దివస్ సందర్భంగా మండలంలోని బూరుగుపల్లిలో బీఆర్ఎస్ జెండాను ఎమ్మెల్యే ఎగురవేశారు. అనంతరం మధురానగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక బిడ్డనైన తాను నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. స్థానికేతరులను గెలిపిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు వారంటీ లేదని, 60 ఏండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సందర్బంగా బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు. స్థానికంగా ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తనను మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో గంగాధర, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలగౌడ్, వెలిచాల తిర్మల్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు, సర్పంచులు వేముల అంజిలావణ్య, వేముల దామోదర్, నాయకులు అట్ల శేఖర్రెడ్డి, దూలం శంకర్గౌడ్, తోట నాంపెల్లి, గడ్డం స్వామి, వాసాల గంగాధర్, మడ్లపెల్లి రమేశ్, నల్ల నరోత్తంరెడ్డి, తూము తిరుపతి పాల్గొన్నారు.