మానకొండూర్, జూన్ 8: మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా గురువారం మానకొండూర్ పెద్దచెరువు వద్ద నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా వచ్చి, మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, చెరువుల్లో పూడిక చేరి, కట్టలు కరిగి, నిల్వ నీరు లేకుండా బోసిపోయి ఉండేవని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలకు జీవంపోస్తూ మిషన్ కాకతీయను తీసుకువచ్చి చెరువులకు జీవం పోశారన్నారు. మండు వేసవిలో చెరువులు నిండుకుండల్లా ఉన్నాయంటే అది సీఎం కేసీఆర్ ఘనతనే అని చెప్పారు.
మానకొండూర్ పెద్దచెరువు మినీ ట్యాంక్బండ్గా రూపాంతరం చెందిందని, సుడా నిధులతో సుందరీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు డప్పు చప్పుళ్లు, కోలాట నృత్యాల నడుమ మహిళలు, గ్రామస్తులు బతుకమ్మ, బోనాలతో గడిమహాల్ నుంచి చెరువుకట్ట దాకా ర్యాలీగా వచ్చారు. అనంతరం చెరువుకట్టపై బతుకమ్మలను ఉంచి ఆడిపాడారు. ఈ సందర్భంగా కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పీసీఈవో ప్రియాంక కర్ణణ్, జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, ఎస్సారెస్పీ డీఈ వేణుమాధవ్, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.