జమ్మికుంట, డిసెంబర్ 11: తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టంచేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం జమ్మికుంటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలో లేనప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని పేర్కొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రతి గడపనూ తడతానని అన్నారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని కష్టానష్టాల్లో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేగా తనను గెలిపించేందుకు ఎంతగా కష్టపడ్డారో.. పంచాయతీ ఎన్నికల్లో మీ గెలుపు కోసం అదేవిధంగా కష్టపడి గెలిపించుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధుతో పాటు పండిన పంటకు బోనస్ వెంటనే అందించాలన్నారు. ఈ సమావేశంలో జమ్మికుంట చైర్మన్ తకలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్పర్సన్ పద్మ, కోటి, బీఆర్ఎస్ నాయకులు పింగిలి రమేశ్, పాల్గొన్నారు.