వీణవంక, ఫిబ్రవరి 7: దళితబంధు పథకం కింద రెండోవిడుత డబ్బులు రాలేదని లబ్ధిదారులు అధైర్యపడి అఘాయిత్యాలకు పాల్పడొద్దని, వారి కుటుంబాలకు తాను అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు. మండల కేంద్రంలో దళితబంధు రెండు విడుత డబ్బులు రాలేదని లబ్ధిదారు గాజుల అమల ఇటీవల ఆత్మహత్యకు యత్నించగా, బుధవారం స్థానిక నాయకులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో నాలుగు వేల కుటుంబాలకు దళితబంధు రెండో విడుత డబ్బులు రావ్వాల్సి ఉందన్నారు.
దళితబంధు లబ్ధిదారుల ఖాతాలు ఎందుకు ఫ్రీజ్ చేశారో చెప్పాలన్నారు. నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని దళితులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ.12 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి చెందిన గెల్లు అశోక్ ఇటీవల మృతిచెందగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెంట వైస్ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నీల కుమారస్వామి, మాజీ ఉపసర్పంచ్ భానుచందర్, నాయకులు గెల్లు కొమురయ్య, దాసారపు కృష్ణచైతన్య, గెల్లు కుమార్, శ్రీనివాస్ తదితరులున్నారు.