గంగాధర, అక్టోబర్ 27: తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే కేసీఆర్ కావాలో.. అబద్ధపు హామీలతో సున్నం పెట్టే కాంగ్రెస్, బీజేపీ కావాలో..? మీరే ఆలోచించాలని ప్రజలకు బీఆర్ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ విజ్ఞప్తి చేశారు. పనిచేసే వాళ్లను ఆదరించాలని కోరారు. కాంగ్రెస్కు అధికారమిస్తే 24 గంటల కరెంటు ఇవ్వరని, రైతు బంధును బంద్ చేస్తారని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే సీఎం కేసీఆర్ను మరిచిపోవద్దని సూచించారు.
చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న తనను ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గంగాధర మండలం హిమ్మత్నగర్, గట్టుభూత్కూర్, చిన్నఆచంపల్లి, ఆచంపల్లి, వెంకంపల్లి, కాసారం గ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేసి అరిగోస పడుతున్నామని కర్ణాటక రాష్ట్ర రైతులు 200 మంది కొడంగల్, గద్వాల నియోజకవర్గాల్లో నిరసన తెలుపుతూ, ప్రజలకు వివరిస్తున్నారని పేర్కొన్నారు. జన్ధన్ ఖాతా కోలో హమ్ ధన్ధన్ పంద్రా లాక్ దాలేంగే అన్న ప్రధాని మోదీ 15 పైసలు కూడా జమచేయలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీది కుర్చీలాట అని, బీజేపీది మత రాజకీయమని, బీఆర్ఎస్ది ప్రజా సంక్షేమమని పేర్కొన్నారు.
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. రూ. 1800 కోట్లతో చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేరొన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేసి తీరుతారని, మాట ఇచ్చి మడమ తిప్పని మహా నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులందరికీ గృహలక్ష్మి, బీసీ బంధు అందజేస్తామన్నారు. రైతు బీమా మాదిరిగా ప్రతి కుటుంబానికీ మేలు చేసేలా రూ.5 లక్షల బీమా వర్తించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి తీసుకురాలేదన్నారు, ఎన్నికల సమయంలో వచ్చి అసత్యపు ప్రచారం చేసే వారిని నమ్మి మోసపోవద్దని కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్, జడ్పీటీసీ పుల్కం అనురాధ-నర్సయ్య, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలాగౌడ్, వెలిచాల తిర్మల్రావు, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, సర్పంచులు కంకణాల విజేందర్రెడ్డి, కొంకటి శంకర్, దోర్నాల హన్మంతరెడ్డి, మాల చంద్రయ్య, వేముల దామోదర్, ఎంపీటీసీ కోలపురం లక్ష్మణ్, నాయకులు ఆకుల మధుసూదన్, రామిడి సురేందర్, రేండ్ల శ్రీనివాస్, తడిగొప్పుల రమేశ్, నిమ్మనవేని ప్రభాకర్, కడపల మల్లేశం, సముద్రాల అజయ్, సుంకె అనిల్, మామిడిపెల్లి అఖిల్, ఇరుగురాల రవి, గంగాధర శ్రీకాంత్, బండారి శ్రీనివాస్ పాల్గొన్నారు.