ధర్మారం,జనవరి19: ధర్మపురి నియోజక వర్గంలోని రైతులకు యాసంగిలో సాగు నీటి ఇబ్బందులు రానివ్వమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. యాసంగి పంటల సాగుకు నీరందడం లేదని పలు గ్రామాల రైతులు చేసిన వినతి మేరకు శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ తూము నుంచి నీటి ని లక్ష్మణ్ కుమార్ విడుదల చేశారు.
నంది రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గి పోకుండా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటిని పంపింగ్ చేసి నింపాలని నీటి పారుదల శాఖ జగిత్యాల జిల్లా సీఈ సుధాకర్ రెడ్డికి సూచించారు. నంది రిజర్వాయర్ నుంచి నిర్మిస్తున్న నూతన లింక్ కాల్వకు ఎస్సారెస్పీ 5ఆర్ కాల్వకు అనుసంధానం చేసి నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రిజర్వాయర్ వద్ద అసంపూర్తిగా ఉన్న గంగాదేవి ఆలయ నిర్మాణానికి తనవంతుగా రూ. 50 వేలు విరాళం అందిస్తానని, ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి పూర్తి చేయిస్తానని గంగపుత్రులకు ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆయన జడ్పీ పాఠశాలను సందర్శించగా ఉపాధ్యాయులు సన్మానించారు. అక్కడి నుంచి తెనుగువాడకు వెళ్లి పలువురిని పరామర్శించారు. ఎస్సారెస్పీ ఈఈ నూనె శ్రీధర్, సర్పంచ్ సామంతుల జానకి, ఉప సర్పంచ్ కట్ట రమేశ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.