సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు ఆగినయి. అయితే ఇంకా వారికి చేయాల్సింది చాలా ఉన్నది. ప్రతి కార్మికుడుకి 15వేల నుంచి 25వేల వరకు సంపాదన సమకూరేలా చర్యలు తీసుకుంట. ఏండ్ల కొద్ది కరువుతో తండ్లాడిన సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలు సస్యశ్యామలం కాబోతున్నయి. ఇప్పటికే వేములవాడ నియోజకవర్గంలోని 40 వేల ఎకరాలకు ఎల్లంపల్లి ద్వారా గోదావరి జలాలు తీసుకొచ్చినం. త్వరలోనే మిడ్మానేరు ద్వారా ఎగువమానేరులోకి నీళ్లివ్వబోతున్నం. మానేరు వాగు ఇక 365 రోజులు పారుతుంది. స్వామి వారి ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసుకున్నం. భవిష్యత్లోనూ మీరు ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతది. నాటి సిరిసిల్ల, వేములవాడకు నేటి పరిస్థితులను ఒక్కసారి పోల్చి చూడండి. నేను చెప్పినవి అబద్ధాలైతే బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్ రానివ్వకండి. నేను చెప్పినవి నిజమే అయితే అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించండి.
వేములవాడ, అక్టోబర్ 16: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ప్రధాన లక్ష్యంగా ప్రతి కార్యకర్తా కష్టపడి పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది మం డలాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, నేతలతో కలిసి సోమవారం వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు నివాసంలో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలు, ప్రభుత్వ పథకాలపై ప్రచారం, తదితర ఆంశాలపై కార్యకర్తలకు సుదీర్ఘంగా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భం గా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆరే హ్యాట్రి క్ సీఎం కావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ను దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిపామని గుర్తుచేశారు. మ్యానిఫెస్టోలో ఉన్న పథకాలు ఆదర్శవంతంగా ఉన్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలన్నీ ఉత్తవేనన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.
చిత్తశుద్ధితో పని చేసి వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరా రు. అంతకుముందు చల్మెడ ఆధ్వర్యంలో కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. పట్టణ పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జడ్పీ చైర్పర్సన్ అరుణ, మార్కెఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సీనియర్ నేత ఏనుగు మనోహర్రెడ్డి, జగిత్యాల జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్రావు, జడ్పీటీసీలు మ్యాకల ఎల్లయ్య, ఏశ వాణి, గట్ల మీనయ్య, నాగ భూమ య్య, ఎంపీపీలు బూర వజ్రమ్మ, బండ మల్లేశంయాదవ్, బైరగోని లావణ్య, గంగం స్వరూప, రేవతి, పార్టీ అధ్యక్షులు పుల్కం రాజు, ఊరడి ప్రవీణ్, గోస్కుల రవి, మల్యాల దేవయ్య, మ్యా కల ఎల్లయ్య, కమలాకర్, ప్రసాద్, సత్తిరెడ్డి, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, సెస్ డైరెక్టర్లు, ఏఏంసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు బంధు కమిటీ అధ్యక్షులు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.