మంథని, సెప్టెంబర్ 21: మంథని నియోజకవర్గంలో ప్రతిపక్షాల అసత్యాలు, విష ప్రచారాలను తిప్పికొట్టాలని, అభివృద్ధే ధ్యేయంగా పని చేసే బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ప్రజలకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం పెద్దపల్లి, భూపాలపల్లి జడ్పీ అధ్యక్షులు పుట్ట మధూకర్, జక్కు శ్రీహర్షిణితో కలిసి మంథని మున్సిపల్ పరిధిలోని కూచీరాజ్పల్లిలోని బొక్కలవాగుపై చెక్ డ్యామ్ కం బ్రిడ్జి, మాడ్రన్ దోబీఘాట్, శ్రీరామకాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్పై మొదటి అంతస్తు నిర్మాణ పనులు, బొక్కలవాగు మినీ ట్యాంక్ బండ్పై నిర్మించిన సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టం ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని పోస్టాఫీస్ ఏరియాలో గులుకోట శ్రీరాములు, అంబేద్కర్ చౌరస్తాలో ఏరియాలో కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొప్పుల మాట్లాడారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని, ఈ రోజు రైతులంతా సంతోషంగా సేద్యం చేసుకుంటున్నారంటే ఆ ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. దళిత బంధును రానున్న 8 ఏండ్లలో ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ బడులు, దవాఖానలతో పాటు వ్యవసాయ రంగంతో పాటు ప్రభుత్వ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లలో భారీ అవినీతి చేశారన్నారు. మంథని నియోజకవర్గంలోనూ ఏండ్లపాటు పాలించినా చేసిందేమీ లేదని, కానీ బీఆర్ఎస్ తొమ్మిదిన్నర కాలంలోనే కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్ను గెలిపించుకొని నియోజకవర్గంపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని కోరారు.
అనంతరం పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ మాట్లాడారు. ‘మంథని నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత ఈ నేలతో అనుబంధం ఉన్న స్థానికుడు గులకోట శ్రీరాములు ఎమ్మెల్యేగా నిజమైన ప్రజా సేవ చేశారు. ఇదే నేలతో అనుబంధం ఉన్న నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ఎమ్మెల్యేగా విశేష సేవలందించానని’ చెప్పారు. కానీ ప్రజలు గత ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వలేదని, తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం ప్రతిపక్ష కాంగ్రెస్ చేసిన కుట్రలు, కుతంత్రాల వల్లే ప్రజలు తనను దూరం చేశారని గుర్తు చేశారు. ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధి కాంక్షకుడిగా మళ్లీ మీ ముందుకు వస్తున్నానని ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజా సేవ చేసి మీ రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి ప్రజా అంకిత యాత్ర శ్రీకారం చుడుతున్నానని, ముత్తారం మండలం నుంచే ప్రారంభిస్తున్నానని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి మాట్లాడుతూ అభివృద్ధికి, ప్రజాసేవకు మారు పేరు జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అని కొనియాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే మంథని నియోజకవర్గంలో అనేక సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించాయని, మంథని నియోజకవర్గానికి ఎమ్మెల్యే పదవి అనేది అలంకరణగా కాకుండా అభివృద్ధి చేసే వ్యక్తికి ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ మాట్లాడుతూ మంథని మున్సిపల్ పరిధిలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మున్సిపల్ పాలకవర్గం, సిబ్బంది నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. తాను మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా, మున్సిపల్ చైర్ పర్సన్గా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ నాయకత్వంలో మంథనిని అభివృద్ధిలో అగ్రస్థానం నిలిపామన్నారు. ఇక్కడ ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్లాల్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎగోలపు శంకర్గౌడ్, వీకే.రవి, శ్రీపతి బానయ్య, కొట్టే పద్మ రమేశ్, నక్క నాగేంద్ర శంకర్ పాల్గొన్నారు.
తెలంగాణ తొలి, మలి తరం పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మంథని తొలి ఎమ్మెల్యే గులుకోట శ్రీరాములు విగ్రహాలను మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజలతో కలిసి ఆవిష్కరించారు. పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణంలోని పోస్టాఫీస్ చౌరస్తా వద్ద శ్రీరాములు విగ్రహాన్ని, మంథని అంబేద్కర్ చౌరస్తా వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను వారు ఆవిష్కరించి నివాళులర్పించారు.
మంథని మున్సిపల్ పరిధిలోని కూచీరాజ్పల్లి వద్ద బొక్కలవాగుపై 6కోట్ల నిధులతో నిర్మించతలపెట్టిన చెక్ డ్యామ్ కం బ్రిడ్జి పనులను ప్రారంభించారు. అలాగే స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ బాలుర హైస్కూల్లో 1.84కోట్లతో నిర్మించిన 16గదులను ప్రారంభించారు. మంథని పట్టణానికి మరింత సొబగులు అద్దుకునే విధంగా మినీ ట్యాంక్ బండ్పై 1.99 కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, ట్యాంక్ బండ్తో పాటు పలు చెరువుకట్టలపై 1.61కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంలను స్వీచ్ ఆన్ చేసి ప్రారంభించారు. శ్రీరామకాలనీలో 1.20కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీలు, బస్టాండ్ ఎదురుగా ఉన్న మంథని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్పై 70లక్షల నిధులతో మొదటి అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించారు.
ప్రజల అవసరాలను దృష్టికి ఉంచుకొని మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రజక కుటుంబాల ఆర్థిక ప్రగతిని మరింత మెరుగు పరిచే విధంగా పట్టణంలోని పవర్ హౌస్కాలనీలో మంథని మున్సిపాలిటీకి చెందిన దాదాపు 7 గుంటల స్థలంలో 2కోట్ల నిధులతో మోడ్రన్ దోబీ ఘాట్ నిర్మాణ పనులను ప్రారంభించారు. మున్సిపల్లోని 13వార్డుల ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా బట్టలను ఉతకడం, ఆరవేయడం, ఇస్త్రీ సైతం చేసే విధంగా మోడ్రన్ దోబీ ఘాట్లను నిర్మించనున్నారు. పట్టణంలోని 150 రజక కుటుంబాలకు వారి వృత్తి ఉపాధి చర్యల నిమిత్తం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.