రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుని, అల్మాస్పూర్ శివారులో దళితబంధు పథకం కింద ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్న రైసు మిల్లును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సిరిసిల్లకు చేరుకుని, సంజీవయ్యనగర్లో కొత్తగా నిర్మించిన హిమాన్షి పిల్లల దవాఖానను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30గంటలకు పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్ఎస్ నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతారు. 2.30గంటలకు సమీకృత కలెక్టరేట్లో జరిగే జాతీయ పంచాయతీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. 27 ఉత్తమ పంచాయతీలకు అవార్డులను ప్రదానం చేస్తారు. తర్వాత అక్కడే ఆర్టీసీ సిరిసిల్ల డిపో నుంచి నడపనున్న కాకినాడ సూపర్లగ్జరీ, వరంగల్కు వెళ్లే డీలక్స్ బస్సు సర్వీసులను ప్రారంభించనున్నారు.
రాజన్న సిరిసిల్ల, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం జిల్లాకు రానున్నారు. మొదట ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుని దళితబంధు యూనిట్ అయిన రైస్మిల్లును ప్రారంభించి, సిరిసిల్ల పట్టణంలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని కార్యకర్తలతో కలిసి భోజనం చేయనున్నారు. తర్వాత కలెక్టరేట్లో జరిగే జాతీయ పంచాయతీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని, 27 ఉత్తమ పంచాయతీలకు అవార్డులను ప్రదానం చేస్తారు.
అమాత్యుడి చొరవతో అద్భుతంగా గ్రామాలు
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాలోని గ్రామ పంచాయతీలు అద్భుతంగా మారాయి. స్వచ్ఛ సర్వేక్షణ్, పేదరిక నిర్మూలన, జీవన ఉపాధుల పెంపు అంశాల్లో పలు అవార్డులను అందుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల కృషి ఫలితంగా అభివృద్ధి, సంక్షేమంలో జిల్లా పరిషత్, పంచాయతీలు జాతీయ స్థాయిలో మెరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అం దించే జాతీయ అవార్డులను అందుకున్న వాటిలో మొత్తం 11 గ్రామ పంచాయతీలున్నాయి. అందు లో వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం రెండు సార్లు అవార్డు దక్కించుకుంది. రామన్నపల్లె, సిరిసిల్ల నియోజకవర్గంలో తంగళ్లపల్లి మండలం బాలుమల్లుపల్లె, కస్బెకట్కూరు, గోపాల్రావుపల్లె, మండెపల్లి, ముష్టిపల్లి, ముస్తాబాద్ మండలంలో మోహినికుంట, మద్దికుంట, ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్ జాతీయ స్థాయిలో గతంలో అవార్డులు అందుకున్నాయి.
మంత్రి చేతులమీదుగా అవార్డులు అందుకోనున్న పంచాయతీలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పలు విభాగాల్లో జిల్లా స్థాయిలో పలు గ్రామాలు అవార్డులకు ఎంపికయ్యాయి. పేదరిక నిర్మూలన, జీవనోపాధి పెంపు, ఆరోగ్య పంచాయతీ, పిల్లల స్నేహపూర్వక పంచాయతీ, నీటి సమృద్ధిగల పంచాయతీ, పరిశుభ్రత, పచ్చదనం, స్వయం సమృద్ధి వసతులు, సాంఘిక భద్రత, సుపరిపాలన, మహిళా స్నేహపూర్వక వంటి 9 అంశాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి అవార్డులకు 27 గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి. నేడు మంత్రి రామన్న చేతుల మీదుగా కలెక్టర్ కార్యాలయంలో సర్పంచులు అవార్డులు అందుకోనున్నారు.