సెస్ నూతన పాలకవర్గానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్గా ఎన్నికైన చిక్కాల రామారావు, వైస్చైర్మన్ దేవరకొండ తిరుపతితోపాటు డైరెక్టర్లందరికీ ఫోన్ చేసి అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు, ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించి మరింత బాధ్యతను పెంచారని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
కరీంనగర్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిరిసిల్లను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన మంత్రి కేటీఆర్, ఆది నుంచీ సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)ను కాపాడుకుంటూ వస్తున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కోట్లాది రూపాయలతో సకల హంగులు కల్పించారు. కొత్తగా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయించడంతోపాటు లూజ్లైన్లు, దెబ్బతిన్న స్తంభాలు ఇలా ఎన్నో విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపారు. అలాగే, రైతులకు పూర్తి ఉచితంగా, నేతన్నలకు 50 శాతం సబ్సిడీపై కరెంట్ సరఫరా అయ్యేలా చూశారు. అలాగే.. నాయీబ్రాహ్మణులు, రజకులకు ప్రతి నెలా 250 యూనిట్లు, ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్ల విద్యుత్ సరఫరా చేయించారు. ఇదే సమయంలో అడిగిన వెంటనే కొత్త కనెక్షన్లు మంజూరయ్యేలా చూశారు.
ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చేశారు. ఇటీవల సెస్ ఎన్నికలు రావడం, బీజేపీ నేతలు కుట్రలు పన్నడంతో మంత్రి ఆలోచనలో పడ్డారు. ఎనిమిదేళ్లుగా మెరుగైన సేవలందిస్తున్న సెస్ ఎక్కడ నిర్వీర్యమైపోతుందోననే ఆందోళనతో ఎలాగైనా రక్షించుకోవాలని ముందుకొచ్చారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపును భుజాన వేసుకున్నారు. రైతన్నలు, నేతన్నలు, వినియోగదారులను చైతన్యం చేసి బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు నేరుగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్కు ముందురోజు 13 మండలాల్లోని అన్నదాతలతో ముచ్చటించారు. చేసిన అభివృద్ధిని వివరిస్తూనే.. నాడు కరెంట్ ఎలా ఉన్నదో? ఇప్పుడెలా ఉన్నదో? గమనించాలని సూచించారు. ఏ కష్టం వచ్చినా ఇన్నాళ్లు అండగా ఉన్నామని, ఇకపైనా అలాగే ఉంటామని, సెస్ను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అమాత్యుడు రామన్న పిలుపుతో కదిలిన అన్ని వర్గాల ఓటర్లు పోలింగ్ రోజున ఓటోత్సాహం చూపారు. అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. 87,130 మంది ఓటర్లకు గాను 73,189 (84శాతం) మంది ఓటు వేసి, అభ్యర్థులకు ఘన విజయాన్ని కట్టబెట్టారు.
నాలుగోసారి ఎగిరిన జెండా
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)పై వరుసగా నాలుగోసారి గులాబీ జెండా ఎగిరింది. 2007 నుంచి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ఏకపక్షమవుతన్నది. ఆనాడు సెస్పరిధిలో 11 స్థానాలుంటే 11 స్థానాల్లోనూ గులాబీ బలపరిచిన అభ్యర్థులే ఘనవిజయం సాధించారు. చైర్మన్గా చిక్కాల రామారావు, వైస్చైర్మన్గా గూడూరి ప్రవీణ్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2010, 2016లో జరిగిన ఎన్నికల్లోనూ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో సెస్ డైరెక్టర్ స్థానాల సంఖ్య 15కు పెరిగినా.. అన్నింటా పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. మంగళవారం చైర్మన్గా చిక్కాల రామారావు, వైస్ చైర్మన్గా దేవరకొండ తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
శ్రేణుల్లో జోష్
సెస్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆనందంలో ము నిగిపోయారు. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికలు జరగడం, అందులో ప్రభంజనం సృష్టించడంతో జోష్ మీదున్నారు. నిజానికి పోలింగ్ రోజు నుంచే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఫలితాలు వెల్లడి కాగా, సంబురాలు చేసుకున్నారు. మంగళవారం పాలకవర్గం కొలువుదీరడంతో పెద్ద ఎత్తున పటాకలు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. సిరిసిల్లలో భారీ ర్యాలీ తీశారు. మంత్రి కేటీఆర్ పనితీరుకు ఈ ఎన్నికలే నిదర్శనమని చెబుతున్నారు. మున్ముందు ఏ ఎన్నికలు వచ్చినా ఇలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు బండి సంజయ్ మాటలను నమ్మలేదని, ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టారని, తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తేల్చి చెప్పారని స్పష్టం చేశారు.
కమలంలో కల్లోలం..
కరీంనగర్ ఎంపీ నియోకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో సెస్ పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. సెస్ పరిధిలోని 73వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. అందులో ప్రధానంగా రైతులు, నేత కార్మికులు ఉద్యోగులు, వ్యాపార, వాణిజ్యవర్గాల వారు అధికంగా ఉన్నారు. వీరంతా బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టంగట్టి, బీజేపీకి గట్టి షాక్ నిచ్చారు. సెస్ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో మోసపూరిత మాటలు చెప్పిన బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ సొంత ఇలాకాలోనే ఘోర పరాభవం చూడాల్సి వచ్చింది. సొంత నియోజకవర్గంలో కనీసం ఒక్క సీటు కూడా రాకపోవడంతో కమలంలో కల్లోలం మొదలైంది. ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత గడ్డపైనే ఎందుకు విజయం సాధించలేకపోయారన్న చర్చ జోరుగా సాగుతున్నది. ఆయన స్వయంగా ఎంపీగా ఉన్న నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే.. ఇక రేపు రాష్ట్రంలో ఏమి వెలుగబెడుతారన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది.