‘ప్రతి సీజన్కు రైతు బంధు ఇచ్చి పెట్టుబడికి ఏ బాధాలేకుంట, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి సాగులో ఎక్కడా ఇబ్బందులు రాకుండా కాపాడుకునే సీఎం కేసీఆర్ కావాలా..? రాబంధుల్లా అన్నీ తన్నుకుపోయి, కరెంట్ కోతలు పెట్టి వేధించే కాంగ్రెస్ కావాలా..? ఎవరు కావాలో మీరే ఆలోచించుకోవాలని’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రైతులకు సూచించారు. సోమవారం వెల్గటూర్లో ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా రోడ్షో నిర్వహించి, మాట్లాడారు.
కాంగ్రెస్ ఒక్క చాన్స్ అంటూ వస్తున్నదని, వాళ్లకు ఒక్కటి కాదు ఇప్పటివరకు 11సార్లు అవకాశం ఇచ్చామని, 55 ఏండ్లు పాలించి కనీసం ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ కొత్త పార్టీ కాదని, చెత్తపార్టీ అని, ఆ పార్టీకి ఓటేస్తే రైతుబంధు తీసేస్తారని, కరెంట్ కాటకలుస్తుందని చెప్పారు. ముండ్ల చెట్టును నాటి పండ్లు రావాలంటే రావని, ఈశ్వర్ లాంటి మంచి వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. రాష్ర్టానికి సీఎం కేసీఆర్ రక్ష అయితే, ధర్మపురి నియోజకవర్గానికి ఈశ్వర్ రక్ష అని ప్రశంసించారు.
– వెల్గటూర్, నవంబర్27
వెల్గటూర్, నవంబర్27: ‘మీకు రైతు బంధు ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకునే బీఆర్ఎస్ కావాలా..? రాబంధుల్లా అన్నీ తన్నుకుపోయి, తీసేసి వేధించే కాంగ్రెస్ కావాలా..? రైతులే తేల్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం వెల్గటూర్ మండల కేంద్రంలో ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా రోడ్షో ద్వారా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మొదట మహిళలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కరెంటు గురించి మాట్లేండేందుకు కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలన్నారు. రైతులకు 3గంటల కరెంటు కావాలని రేవంత్రెడ్డి అంటున్నాడని, వ్యవసాయానికి రైతులు ఏ మోటార్ వాడాలో కూడా తెలియని సన్నాసి రేవంత్ అని మండిపడ్డారు. 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా..? మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాలా..? ప్రజలే తేల్చుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ ఒక్క చాన్స్ అంటూ వస్తున్నదని, వాళ్లుకు ఒక్కటి కాదు ఇప్పటివరకు 11 సార్లు అవకాశం ఇచ్చామని, 55 ఏండ్లు పాలించి ఏం చేసిందో చెప్పాలన్నారు. కనీసం ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ కొత్త పార్టీ కాదని, చెత్తపార్టీ అని, కాంగ్రెస్కు ఓటేస్తే రైతుబంధు తీసేస్తారని, కరెంటు కాటకలుస్తుందన్నారు. రైతు బంధు కొత్త పథకం కాదని, ఇప్పటిదాకా 11సార్లు వేశామని, ఈ సారి డబ్బులు జమ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తే ఈ కాంగ్రెస్ నాయకులు పోయి కంప్లెయింట్ చేసి నిలిపివేయించారని మండిపడ్డారు.
రైతుబంధుపై కాంగ్రెస్ వక్రబుద్ది బయట పడిందన్నారు. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతు బంధు డబ్బులు ఖాతాల్లో జమచేస్తామన్నారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదని, ధరణిని రద్దు చేసి పట్వారీ వ్యవస్థను మళ్లీ తెస్తామని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారని, మళ్లీ ఆ దరిద్రపు పాలన మనకు అవసరమా..? చెప్పాలని ప్రశ్నించారు.
2014 ఎన్నికల టైంలో సిలిండర్ ధర ప్రజలకు భారమైపోతున్నదని చెబుతూ ఓటు వేసేముందు సిలిండర్కు మొక్కి ఓటువేయాలని ఆనాడు మోడీ మాట్లాడారని గుర్తు చేశారు. అయితే ఆయన గెలిచిన తర్వా త రూ.400ధర ఉన్న సిలిండర్ ధరను ఏకంగా రూ.1200కు పెంచాడన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి గెలవగానే సిలిండర్ను రూ.400కే సిలిండర్ అందజేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు మార్పు కావాలని మాట్లాడుతున్నారని, ఏం మార్పు కావాలి..? మూడు నెలలకోసారి ముఖ్యమంత్రుల మార్పా..? రూ.2000 పెన్సన్ రూ.200కు మార్పా..? 24 గంటల కరెంట్ 3 గంటలకు తగ్గింపా..? అని ఎద్దేవా చేశారు. మాట్లాడితే చాలు సీఎం కేసీఆర్ మార్చాలని మాట్లాడుతున్నారని, వాళ్లేమో నెహ్రూ నుంచి రాహుల్ వరకు రాజ్యమేలవచ్చుగానీ, తెలంగాణ సాధించిన కేసీఆర్ రెండుసార్లు సీఎంగా ఉంటే జడిసిపోతున్నారని ఎద్దేవా చేశారు. ధర్మపురిలో ఈశ్వరన్న మీద నాలుగు సార్లు ఓడిపోయిన వ్యక్తి, ఈసారి అతన్ని గెలిపించకపోతే చచ్చిపోతానని ప్రజలను బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడడం సరికాదన్నారు.
అలాంటి సెంటిమెంట్ మాటలకు మీరు జాలిపడితే వచ్చే ఐదేండ్లు మీరు బాధపడాల్సి ఉంటుందన్నారు. స్తంభంపల్లిలో ఇథనాల్ ప్రాజెక్టును రద్దు చేసి దాని స్థానంలో వ్యవసాయ కళాశాలను తెచ్చుకున్నన్నామని, ఐటీఐ, పాలిటెక్నిక్ కాళేజీ, ఫిస్ ప్రాసెస్ యునిట్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముండ్ల చెట్టును నాటి పండ్లు రావాలంటే రావని, ఈ ఎన్నికల్లో ఈశ్వర్ లాంటి మంచి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతుందని వివరించారు. కాంగ్రెస్కు ఓటేస్తే 50 ఏండ్లు వెనక్కిపోతామని, కారు గుర్తు కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. రాష్ర్టానికి సీఎం కేసీఆర్ రక్ష అయితే, ధర్మపురి నియోజకవర్గానికి ఈశ్వర్ రక్ష అని చెప్పడంతో సభలో ఉన్న వారంతా కేరింతలు కొట్టారు. ఇక్కడ పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ బొడ్డు సుధారాణి, ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్, నాయకులు బాదినేని రాజేందర్,చల్లూరి రాంచందర్గౌడ్, సింహాచలం జగన్ పాల్గొన్నారు.
కేసీఆర్ దమ్మున్న నాయకుడు. తెలంగాణను సాధించి, సీఎంగా ఆయన నాయకత్వంలో తొమ్మిదేండ్లలోనే రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఆయన సహకారంతో నేను కూడా ధర్మపురి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశా. ఈ రోజు జరుగుతున్న ఎన్నికలు కేవలం వ్యక్తుల కోసం జరుగుతున్నవికావు. ఐదేండ్ల మన భవిష్యత్, అభివృద్ధిని నిర్ణయించే ఎన్నికలు. ఈ క్రమంలో ప్రజలంతా మంచి, చెడులు ఆలోచించి ఓటు వేయాలి. గతంలో ఈ ప్రాంతం ఎలా ఉం డె..? కరెంట్, తాగు, సాగు నీరులేక అరిగోస పడ్డం. ఇప్పుడెలా ఉంది..? ఎంతలా అభివృద్ధి చెందిందో ఒకసారి ఆలోచించాలి. ఈ అభివృద్ధి ఇలానే కొనసాగాలంటే ఈ నెల 30 న కారు గుర్తుకు ఓటేసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ను గెలిపించాలి. కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు. నమ్మితే మోసపోతరు.
– కొప్పుల ఈశ్వర్, ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి