‘రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. జూలైలో సాధారణం కంటే 450 శాతం అత్యధికంగా నమోదైంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. వరదల వల్ల ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ముందుకు కదిలి వరదల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని, పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించాలన్నారు. నోటీసులు జారీ చేయాలని, అవసరమైతే బ్లాక్లిస్ట్లో పెట్టేందుకు సైతం వెనుకాడవద్దని సూచించారు. విస్తారంగా వానలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ గురువారం మధ్యాహ్నం రాజన్నసిరిసిల్ల కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు.
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్/గంభీరావుపేట, జూలై 14 : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సిరిసిల్ల జిల్లాలోని పరిస్థితులపై జడ్పీ చైర్పర్సన్ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, వివిధ శాఖలతో కలిసి కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలతో కలిగిన నష్టం, ప్రజా రవాణాలో ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూలైలో సాధారణ వర్షపాతం కంటే 450 శాతం ఎక్కువగా నమోదు కావడంతో ప్రజాజీవనం స్తంభించిందని, జిల్లాలో అసాధారణ పరిస్థితులు లేవని, అయినా అధికారులు అలక్ష్యంగా, ఉదాసీనంగా ఉండరాదని చెప్పారు. భారీ వరదలు వచ్చినా ఒక్క ప్రాణనష్టం లేకుండా, అస్తినష్టం కనిష్టానికి తగ్గించేలా చూడాలని సూచించారు. జిల్లాలోని 666 చెరువులకు ఇన్ఫ్లో వివరాలు, చెరువు కట్టల సామర్థ్యాలను ఇరిగేషన్ ఈఈ అమరేందర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. చెక్డ్యాంలు, చెరువుల వద్ద నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు పెట్టాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలోని ప్రజలను ఖాళీ చేయించాలని, ప్రమాదకరంగా ఉన్న బోర్బావులు, ఓపెన్వెల్లను పూడ్చివేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని , సిద్దిపేట-సిరిసిల్ల ప్రధాన రహదారిలో స్పీడ్ బ్రేకర్ల వద్ద మార్కింగ్ చేయాలని సూచించారు.
గత ఘటనలు పునరావృతం కావద్దు
సిరిసిల్ల పట్టణంలో వర్షాలు కురిసినప్పుడు గతంలా కలిగిన ఇబ్బందులు పునరావృతం కావద్దని మంత్రి అధికారులకు సూచించారు. వరద నీరు వేగంగా మానేర్వాగులోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీనగర్కాలనీలోని ప్రజ లు ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలన్నారు.
సీజనల్ వ్యాధులపై సమన్వయంతో పని చేయాలి
ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తూ, జాగ్రత్తలు వివరించాలని సూచించారు. రాకపోకలకు ఇబ్బందులు కలిగే గ్రామాల్లో కాన్పులకు సమయం పడుతున్న గర్బిణులను గుర్తించి దవాఖానలకు తరలించాలన్నారు. హెల్త్ డిజిటలైజేషన్ ఈ నెలఖరు వరకు పూర్తి చేయాలని, అన్ని గ్రామాల్లో క్లోరినేషన్ చేయాలని, మిషన్భగీరథ నీరు కలుషితం కానివ్వ వద్దని ఆదేశించారు. మిషన్భగీరథ నీటిని ఎప్పటికప్పుడు పరీక్షించాలని, 1.30 లక్షల కనెక్షన్లకు శాంపిల్ల సేకరణ తక్కువగా జరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు.
సిమెంట్ స్తంభాలు వేయించాలి
జిల్లాలో ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి సిమెంట్వి వేసి విద్యుత్ ప్రమాదాలను నివారించాలని మంత్రి ఆదేశించారు. సెస్ పరిధిలో రెండు లక్షల 84 వేల మంది వినియోగదారులు ఉన్నారని, సిరిసిల్లలో 628, వేములవాడలో 57 ఇనుప స్తంభాలున్నాయని తెలిపారు. సిరిసిల్ల, వేములవాడలో ప్రమాదకరమైన ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సందర్శకులను నియంత్రించాలి
జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర, ఎగువమానేరు జలాశయాలకు వెళ్లే సందర్శకులను నియంత్రించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. ఎస్సారార్ నుంచి నీటిని విడుదల చేసేముందు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అభివృద్ధి పనులు జాప్యం చేసే కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేయాలని, స్పందించని పక్షంలో బ్లాక్లిస్ట్లో పెట్టాలని ఆదేశించారు.
మా నాయనమ్మ భూములు మునిగినయ్..
గత జ్ఞాపకాలను గుర్తు చేసిన మంత్రి కేటీఆర్
ఎగువమానేరు శిఖం శివారులో తమ నాయనమ్మ భూములు మునిగిపోయాయని మంత్రి కేటీఆర్ కలెక్టర్ అనురాగ్ జయంతికి, ఇన్చార్జి ఎస్పీ సింధూశర్మకు వివరించారు. గంభీరావుపేట మండలంలోని నర్మాల వద్ద పరవళ్లు తొక్కుతున్న జలాశయం వద్ద మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన నాయనమ్మ గ్రామం పోసానిపల్లి గురించి అధికారులు చెప్పారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం పోసానిపల్లి తమ నాయనమ్మ ఊరని, ఎగువమానేరు నిర్మించిన కాలంలో భూములు మునిగిపోవడంతో వలస వెళ్లారని ఆ దిశగా చూపుతూ వివరించారు. అనంతరం ఎగువమానేరు కట్టపై నుచి గంగమ్మ తల్లికి పూలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు. ఎగువమానేరు అందాలను కొద్దిసేపు తిలకించారు. మత్తడి దూకుతున్న క్రమంలో సందర్శకులు ప్రమాదాల బారిన పడకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ఉచిత శిక్షణ పొందండి.. ఉద్యోగాలు కొట్టండి
ఉద్యోగార్థులు ఉచిత శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. టాస్క్ ఉచిత శిక్షణ కోసం నమోదు చేసుకొన్న అభ్యర్థులతో కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి దిశానిర్ధేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ద్వారా ఉద్యోగ అర్హత, నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇస్తుందని వివరించారు. సిరిసిల్ల కేంద్రంలో టాస్క్ కొత్తగా ఎనిమిది కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. హస్పిటల్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ అండ్ ఎస్సీఎం, బ్యాంకింగ్ పరీక్ష, టాలీ అకౌంటెంట్ సాఫ్ట్వేర్, పైథాన్ ప్రోగ్రామింగ్, డేటాబేస్ అండ్ ఎస్క్యూఎల్, పూర్తి స్టాక్ అభివృద్ధి, క్లౌడ్ ఫండమెంటల్స్ కోర్సులను త్వరలో ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. జిల్లాలో టాస్క్ ద్వారా ఆరు నెలల్లో రెండువేల మందికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. త్వరలోనే టాస్క్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఎర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మత్స్య, టెక్స్టైల్, పుడ్ పరిశ్రమ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని, టాస్క్ను సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు.