ధర్మపురి, మార్చి19: ‘పేపర్ లీకేజీ ఉదంతం మూలాలు తెలుసుకోకుండానే బీజేపీ, కాంగ్రెస్లు అర్థం లేని ఆరోపణలతో గాయి చేసేది రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మాత్రమే. ఇంకెన్నాళ్లీ మీ నాటకాలు.. ఇప్పటికే ఆందోళనలో ఉన్న యువతను తప్పుదోవ పట్టించేందుకు కావాలనే ఇంత రాద్ధాంతం చేస్తారా..? అంటూ మంత్రి కొప్పుల ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివాం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. టీఎస్పీఎస్సీకి మంత్రి కేటీఆర్కు సంబంధం లేదని, ఈ విషయమై ఆయన వివరణ ఇచ్చినా, ప్రజల్లో ఉన్న ఆదరణను తగ్గించేందుకే కుట్ర చేస్తున్నాయని దుయ్యబట్టారు.
పరీక్షల నిర్వహణలో ఎంత బలమైన వ్యవస్థ ఉన్నప్పటికీ, పరీక్షల నిర్వహణ మానవ ప్రమేయంపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలన్నారు. పరీక్ష విధానానికి కళంకం తీసుకురావడానికి ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు అనైతికంగా ఆలోచించే వ్యక్తి వల్ల, వ్యవస్థకు కీడు చేయాలనే దురుద్దేశం గలిగిన వ్యక్తి వల్ల ప్రశ్నపత్రం బయటకు వస్తుందని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి కళంకం తీసుకువచ్చేందుకే ఇలాంటి కుట్రలు జరుగుతాయన్నారు. ప్రజలు మూలాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణలో ప్రశ్న పత్రం లీకేజీపై బీజేపీ, కాంగ్రెస్లు అనవసరమైన రాద్దాంతం చేయడం విడ్డూరమన్నారు.. పేపర్ లీకేజీ విషయం ప్రభుత్వానికి తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నామని, నిందితులు ఇప్పటికే జైళ్లో ఉన్నారని చెప్పారు. ఇది స్కామ్ కాదని ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు అనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు.
2010లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో గ్రూప్1 పేపర్ లీకేజీ అయితే అప్పుడు సీఎంగా ఉన్న రోశయ్య, ఐటీ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్యయ్య రాజీనామా చేశారా..? అని ప్రశ్నించారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో 15 పరీక్షలకు సంబంధించి పేపర్లు లీకయ్యాయని, హర్యానాలో ఏకంగా నెట్ పరీక్షా పత్రమే లీకైందని గుర్తు చేసిన ఆయన, మరి అక్కడ ప్రభుత్వ పెద్దలు రాజీనామా చేశారా చెప్పాలన్నారు. వివిధ దేశాల నుంచి అనేక కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయనీ, ఇక్కడ అవినీతి ఉంటే ఎందుకు వస్తాయన్నారు. 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కార్దేనని, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనీ, సిట్ పారదర్శకంగా పనిచేస్తుందని మంత్రి చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు.