వెల్గటూర్, నవంబర్ 6: ‘కాంగ్రెస్ పాలన మనకు కొత్తనా..? రాష్ర్టాన్ని 60 ఏండ్లు పాలించి చేసింది శూన్యం. ఇప్పుడు ఒక్క అవకాశం అంటూ, ఆరు గ్యారెంటీలంటూ మోసపు హామీలతో వస్తున్నరు. వాళ్లను నమ్మితిమా..? అంతే సంగతులు. తెలంగాణ మరో 50 ఏండ్లు వెనక్కిపోతుంది. మళ్లీ ఫైరవీలు, గుండాలు, దాదాగిరీల రాజ్యం వస్తుంది. గోసపెడుతరు.. ఆగం చేస్తరు.. జాగ్రత్త’ అంటూ ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఎండపల్లి మండలం అంబారిపేట, గుల్లకోట, చెర్లపల్లి గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించగా, మహిళలు మంగళహారతులు, బతుకమ్మలతో ఘన స్వాగతం చెప్పారు.
గుల్లకోటలో 150 మంది యువకులు బైక్ ర్యాలీ తిసి ఘన స్వాగతం పలికారు. ఆయా చోట్ల మంత్రి కొప్పుల మాట్లాడారు. సీఎం కేసీఆరే మనకు శ్రీరామరక్ష అన్నారు. తొమ్మిదేండ్లలోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో నంబర్వన్ స్థానంలో నిలిపారని కొనియాడారు. తెలంగాణ రాకముందే ఈ ప్రాంతం ఎలా ఉందో..? ఇప్పుడు ఎలా మారిందో ఆలోచించాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడని, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకని, 3 గంటలే చాలని అంటున్నాడని, సరిపోతదా..? మీరే ఒకసారి ఆలోచన చేయాలని సూచించారు. ఈ విషయమై ఆ పార్టీ నాయకులు ఎక్కడ కనిపించినా నిలదీయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాళ్లు ఇప్పుడు అది చేస్తా.. ఇది చేస్తాం.. అని గొప్పలు చెబుతున్నారని, మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి దళితులు పూర్తిగా వెనుకబడిపోయారని, గత ప్రభుత్వాలు వారిని ఓటు బ్యాంకుగా చూశారే తప్ప వారి అభ్యున్నతికి ఏనాడూ కృషిచేయలేదని మండిపడ్డారు. కానీ దళితులకు కేసీఆర్ ఆత్మబంధువుగా నిలిచారని, ఎలాంటి ష్యూరిటీ లేకుండా పక్కోడు ఈర్శపడేలా రూ.10 లక్షలు అందజేశారని కొనియాడారు. ఈ ఎన్నికలు పూర్తికాగానే నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందజేసే అదృష్టం తనకు వస్తున్నదన్నారు. ఈ సందర్భంగా పలువురు యువకులు బీజేపీ, కాంగ్రెస్లను వీడి బీఆర్ఎస్లో చేరగా, వారికి మంత్రి ఈశ్వర్ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఇక్కడ ఎంపీపీ కునమల్ల లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, సర్పంచ్లు దుర్గం లక్ష్మి-తిరుపతి, పోన్నం స్వరూప-తిరుపతి, పడిదం బుచ్చమ్మ, బీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు సింహచలం జగన్, నాయకులు పోనుగోటి రామ్మోహన్రావు,చుక్క శంకర్రావు, గాజుల మల్లేశం, గూడ రాంరెడ్డి, మారం జలేందర్రెడ్డి, ముల్కల్ల గంగారాం, రాజేశ్వర్రెడ్డి, పడిదం మొగిళి, నారాయణ, రియాజ్, మల్లేశ్, జీరెడ్డి మహేందర్రెడ్డి, గ్రామ శాఖ అద్యక్షులు రమణయ్య, జల్లేల కనుకయ్య, లింగంపల్లి పాపయ్య, దామోదర్, వెంకటేశ్ పాల్గొన్నారు.