హుజూరాబాద్: ఈటల రాజేందర్ గోబెల్స్ ప్రచారాన్నే నమ్ముకున్నారని, అబద్ధాలతో గెలిచేందుకు యత్నిస్తున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. హుజూరాబాద్లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏ మీటింగ్కి వెళ్లినా తాను మాట్లాడుతుంటే కావాలనే కరెంట్ కట్ చేస్తున్నారని, తనను వేధిస్తున్నారంటూ ఈటల రాజేందర్ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఇటీవల ఓ ఫంక్షన్ హాలులో ఈటల రాజేందర్ మీటింగ్ పెట్టుకుంటే మైకు మూగబోయిందని, దానికి టీఆర్ఎస్ వాళ్లు కరెంట్ కట్ చేశారంటూ గోబెల్స్ ప్రచారం చేశారని మండిపడ్డారు.
ఈ విషయంపై విద్యుత్శాఖ అధికారులను ఆరాతీస్తే..అసలు ఆ ఫంక్షన్హాల్కు కరెంట్ కనెక్షన్ లేదని, బిల్లు కట్టకుంటే కట్చేశామని చెప్పారన్నారు. అలాగే, ప్రభుత్వ విప్ సుమన్ కారు ఓ ఆటోడ్రైవర్ను గుద్దింది అని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై ఈటల బ్యాచ్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేసిందన్నారు. మొదట సుమన్ కారు గుద్దిందని, తర్వాత సుమన్ సోదరుడి కారు అని, తర్వాత మరొకరంటూ పుకార్లు లేపారని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కారును పట్టుకుంటే అసలు విషయం బయటపడిందన్నారు. ఆటోడ్రైవర్ను గుద్దింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సన్నిహితుడైన విశ్వనాథ్ ఆనంద్ కారు అని తేలిందన్నారు. దీనిపై ఈటల రాజేందర్ ఇప్పటివరకూ ఒక్క మాటల కూడా మాట్లాడలేదని హరీశ్రావు మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై రూ. 291 రూ పన్ను వేస్తోంది.. దాన్ని తొలగించవచ్చు కదా అంటూ ఈటల రాజేందర్ ఓ సభలో మాట్లాడారని, దీనిపై చర్చకు రా అని సవాల్ విసిరితే పత్తా లేకుండా పోయాడని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఏడేళ్లు మంత్రిగా చేసిన ఈటల రాజేందర్కు గ్యాస్ సిలిండర్పై రాష్ట్ర పన్ను ఎంత ఉంటుందో తెలువదా? అని ప్రశ్నించారు. ఆయన హయాంలోనే జీఎస్టీ వచ్చిందని, దీనిపై ఆయనకే ఎక్కువ అవగాహన ఉండాలి కదా? అని మంత్రి హరీశ్రావు అన్నారు. ఈటల మాట్లాడింది కరెక్ట్ అని నిరూపిస్తే తాను ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరానని, రెండు రోజులైనా ఈటల సప్పుడు జేయడం లేదని ఎద్దేవా చేశారు. అలాగే, శంభునిపల్లిలో మహిళలకు వడ్డీలేని రుణాలకు సంబంధించి ఫేక్ చెక్కులు ఇచ్చారని, ఈ నెల 30లోగా చెక్కులు క్లియర్ చేయాలంటూ ఈటల రాజేందర్ మరో ఫేక్ ముచ్చట చెప్పారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఐదు మండలాల్లో రూ.25.89 కోట్లు ఇచ్చామని, బతుకమ్మ పండుగకు ముందు అందరి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయన్నారు. మహిళలు కూడా డబ్బులు వచ్చాయని చెప్పారన్నారు.