కలెక్టరేట్, మే 30: స్వరాష్ట్రంలోనే మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, ఆర్థిక అభ్యున్నతికి భరోసా కల్పిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో స్వయం సహాయక సంఘాల రిసోర్స్పర్సన్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లకు నిర్వహించిన సారె పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథి హాజరై, మాట్లాడారు. సమైక్య పాలనలో 75 ఏండ్లలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే చేసి చూపించారని, ఆ నాటి బాధలకు స్వరాష్ట్రంలోనే విముక్తి దొరికిందని చెప్పారు. ఆనాడు దక్కని నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకున్నామని, ఇంకా లెక్కకు మించిన సంక్షేమ పథకాలతో ఘణనీయమైన వృద్ధిని సాధిస్తూ తెలంగాణ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నదని చెప్పారు. స్వరాష్ట్రంలో మహిళామణుల ఆశీస్సులతోనే తెలంగాణ ఇతోధిక అభివృద్ధి చెందుతుందని, వారి దీవెనలు ఇలాగే కొనసాగిస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సహకరించాలని కోరారు.
ఆర్పీలు, మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే నెలకు రూ.4వేల గౌరవ వేతనం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆర్పీల పాత్ర కీలకమని, కంటి వెలుగు విజయవంతం చేయడంలో ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో మీవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని పద్మనగర్లో చేపడుతున్న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన, స్వామి వారి కల్యాణోత్సవానికి నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
అనంతరం మేయర్ యాదగిరి సునీల్రావు మాట్లాడుతూ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి మంత్రి నగర అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అమోఘమన్నారు. అన్ని వర్గాలను సముచితంగా గౌరవిస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని గంగులను కొనియాడారు. మహిళాదినోత్సవం సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ఆర్పీలకు చీరెలు పంపిణీ చేయడం దేశంలోనే మొదటిసారని వివరించారు. అనంతరం నియోజకవర్గంలోని 221మంది రిసోర్స్పర్సన్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లకు చీరెలు పంపిణీ చేశారు. ఇక్కడ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, జడ్పీటీసీ పిట్టల కరుణ, కరీంనగర్ రూరల్ ఎంపిపి తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మహిళా కార్పోరేటర్లు గంట కళ్యాణి, గందె మాధవి, గుగ్గిల్ల జయశ్రీ, కోల మాలతి, ఎడ్ల సరిత, మాజీ కార్పొరేటర్ నందెల్లి రమ పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు నిండా ముంచినయ్
సహజ సంపదకు నిలయమైన తెలంగాణను ఏడున్నర దశాబ్దాలపాటు కాంగ్రెస్, బీజేపీ సర్వనాశనం చేసినయ్. ఇక్కడి వనరులను దోచుకుపోయినయ్. సీమాంధ్రతోపాటు ఇతర రాష్ర్టాలను అభివృద్ధి చేసినయ్. స్వరాష్ట్రంలో ఉద్యమనాయకుడే పాలకుడిగా మారి చిత్తశుద్ధితో పాలన సాగిస్తుండడంతో రాష్ట్ర రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయినయ్. కరీంనగర్ పట్టణంలో నాడు రోడ్లు అధ్వానంగా ఉండేవి. నేను ఎమ్మెల్యేగా అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డిని నిధులడిగితే ఒక్కరూపాయి ఇయ్యలేదు. కానీ, నేడు కోట్లాది రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేసినం. నగరవాసులు క్షణాల్లో తమ ఇండ్లకు చేరుకునేలా చేసినం. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని సీమాంధ్ర పార్టీలతోపాటు కాంగ్రెస్, బీజేపీ గ్రామాలమీద పడుతున్నయ్. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే ఎన్నికల్లో వారికి గట్టిగా బుద్ధి చెప్పాలి. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి మరింత శరవేగంగా జరగాలంటే సీఎం పరిపాలనకు అండగా నిలువాలి.