భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం చేపట్టిన ‘కోటి వృక్షార్చన’ పండుగలా సాగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. పల్లె, పట్టణం.. ఊరూ వాడా ఎక్కడ చూసినా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ మొక్కలు నాటి, నీళ్లు పోశారు. పలు చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఉత్సాహం నింపారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొనగా, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, దాసరి మనోహర్రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్రావు హాజరై మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
-కరీంనగర్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు భారతదేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా చేపట్టిన ఒక రోజు కోటి వృక్షార్చనకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, మండలకేంద్రాలు, గ్రామాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ మొక్కలు నాటి, నీళ్లు పోశారు. మొక్కలు నాటే ప్రదేశాల్లో మహిళలు ముగ్గులతో అలంకరించగా, అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం పండుగలా సాగింది.
-కరీంనగర్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫార్మసీ కాలేజీ ఎదురుగా ఉన్న రాశి వనంలో మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ బీ గోపి, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు. మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లిలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. గంగాధర, హుజూరాబాద్ మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇల్లందకుంట మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ అధికారులు ఈత, తాటి మొక్కలను పంపిణీ చేశారు. హుజూరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో మహాదేవ్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. వీరితో పాటు అనేక గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొన్నారు.
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు
కార్పొరేషన్, ఆగస్టు 26: భవిష్యత్ తరాలు ఆహ్లాదకర జీవనం కొనసాగించేందుకు అభివృద్ధి, సంపదతోపాటు మంచి వాతావరణం, కాలుష్య రహిత పర్యావరణం అందించడం కోసం విరివిగా మొకలు నాటాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని బ్లాక్-6, ఫార్మసీ కాలేజ్ ఎదురుగా ఏర్పాటు చేసిన మొకలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ గోపి, మేయర్ సునీల్రావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొకలు నాటారు. కరీంనగర్లో 40 వేల మొకలను నాటే లక్ష్యాన్ని నిర్ణయించినట్లు చెప్పారు. అందులో భాగంగా బ్లాక్-6 లో 4 వేల మొకలను నాటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.