వెనుకబడిన వర్గాల కులవృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘బీసీ కులవృత్తుల ఆర్థిక సాయం పథకం’ శనివారం ప్రారంభం కానున్నది. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో లాంఛనంగా ప్రారంభించనుండగా, ప్రతి నెలా ప్రతి నియోజకవర్గంలో 300 మందికి పంపిణీ చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగనుండగా, ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ పంపిణీ చేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది.
-కరీంనగర్, జూలై 14 (నమస్తే తెలంగాణ)
అర్హులందరికీ అందిస్తాం
బీసీల్లోని కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తాం. చివరి లబ్ధిదారుడికీ చేరే వరకు ఈ పథకం నిరంతరం కొనసాగుతుంది. ఆ బాధ్యత మా ప్రభుత్వానిది. ప్రతి నెలా 14 వరకు వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తారు. 15 నుంచి నెలాఖరు వరకు అంటే 15 రోజులపాటు పంపిణీ కొనసాగుతుంది. అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని, కులవృత్తులను అభివృద్ధి చేసుకోవాలి. ఇదే నెలలో ప్రతి నియోజకవర్గంలో 300 మందికి ఆర్థిక సాయం అందిస్తున్నాం. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కలెక్టర్లను ఆదేశించాం.
– మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : బీసీ కుల వృత్తుల సర్వతో ముఖాభివృద్ధికి చేయూతనందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కుల వృత్తులకు ‘రూ.లక్ష ఆర్థిక సహాయం’ పథకాన్ని ప్రవేశ పెట్టింది. బీసీల్లో కుల వృత్తులపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే, గత ప్రభుత్వాల పాలనలో సరైన ప్రోత్సాహం లేక అనేక వృత్తులు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చాయి. స్వరాష్ట్రంలోని వివిధ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బీసీ కులాల్లోని కుల, చేతి వృత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కుల వృత్తుల్లో కొనసాగుతున్న వారికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించే ఈ బృహత్ పథకం అనేక బీసీ కుల వృత్తులకు తిరిగి జీవం పోయనుంది. ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తి ఉచితంగా అందిస్తుండడంతో కుల వృత్తులపై ఆధారపడి బతుకుతున్న బీసీ, ఎంబీసీ కులాల వారు తమ వృత్తులను బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది.
ప్రతి నియోజకవర్గానికి 300
బీసీ, ఎంబీసీ కులాల్లోని లబ్ధిదారులు ఇప్పటికే బీసీ అభివృద్ధి శాఖకు దరఖాస్తులు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 19,095 మంది దరఖాస్తులు చేసుకోగా, ఇప్పటి వరకు 15,922 దరఖాస్తులను అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించారు. జగిత్యాల జిల్లాలో 17,277 మంది దరఖాస్తు చేసుకోగా పది వేలకు పైగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11,327 మంది దరఖాస్తు చేసుకోగా 9,000, పెద్దపల్లిలో 10,759 మంది దరఖాస్తు చేసుకోగా 8553 పరిశీలించారు. కాగా, కడు పేదరికంలో మగ్గుతున్న వారికి, వితంతువులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే, లబ్ధిదారుల కుటుంబాల ఆర్థిక పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన చేసిన సూచనల ప్రకారం అధికారులు లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ప్రతి నెలా 300 మందికి ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి నెలా 14 వరకు వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తారు. 15 నుంచి నెలాఖరు వరకు లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి గంగుల వెల్లడించారు.
నేటి నుంచి ఆర్థిక సహాయం
వెనుకబడిన తరగతుల్లో చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.లక్ష ఆర్థిక సహాయం పథకాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. శనివారం నుంచి నెలాఖరు వరకు 300 కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. వచ్చే నెలలో ప్రతి నియోజకవర్గానికి మరో 300 చొప్పున ఆర్థిక సహాయం చేస్తారు. ఇలా నిరంతర ప్రక్రియగా ఈ పథకం కొనసాగుతుంది. దరఖాస్తుల స్వీకరణ కూడా నిరంతరం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుల వృత్తిదారులైన కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మేదరి, నాయీబ్రాహ్మణ, కృష్ణ బలిజ, తదితర 39 కులాలకు ఈ ఆర్థిక సహాయం అందనుంది. జిల్లాలోని చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లోనూ ఆయా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రతి నెలా 15 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు వారి వెసులుబాటు తీరుగా పంపిణీ చేసే అవకాశాలున్నాయి.
నేటి నుంచి రూ.లక్ష సాయం పంపిణీ
కరీంనగర్ కలెక్టరేట్, జూలై 14 : ఈ నెల 15 నుంచి బీసీ కులవృత్తులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చెకుల పంపిణీ ప్రారంభమవుతుందని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజమనోహర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 1,200 మందికి మొదటి విడుతగా సాయం అందజేయనున్నట్లు పేరొన్నారు. ఈ పథకం కొంత మందికే వర్తిస్తుందన్న ఆపోహలు పెట్టుకోవద్దని సూచించారు. చివరి లబ్ధిదారుడికి సాయం అందించే వరకు ప్రతి నెలా చెకులు అందిస్తూనే ఉంటామన్నారు. బీసీల్లో దారిద్య్రరేఖకు దిగువ ఉన్న వారందరికీ దశల వారీగా పథకం వర్తింప చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని స్పష్టం చేశారు.