తెలంగాణచౌక్, మే28: సమైక్య పాలనలో పూర్తిగా నిరాధారణకు గురైన కుల వృత్తులకు స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ పాలనలో తగిన గుర్తింపు దక్కిందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని సంచారజాతుల కుల సమస్యలను పరిష్కరిస్తామని, రాబోయే రోజుల్లో ప్రతి కుల వృత్తుదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేసేందుకు విధివిధానాలు రూ పొందిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం నగరంలోని వాసర గార్డెన్లో కరీంనగర్ పూసల కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూసల ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. గత పాలకులు కుల వృత్తులను పట్టించుకోలేదని, నిధుల కేటాయించడంలో నిర్లక్ష్యం చేయడంతో ఎంతో మంది జీవనోపాధి కో ల్పోయి కష్టాలు పడ్డారని గుర్తు చేశారు.
నాటి ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకునేందుకు రాష్ట్రంలో 17 వసతి గృహాలు మాత్రమే ఉండేవని, అవి కూడా కనీస వసతుల్లేకుండా అధ్వానంగా ఉండేవని చెప్పారు. కానీ నేడు స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలనలో కుల వృత్తులు, వెనుకబడిన కులాల వారికి అనేక పథకాలతో అండగా నిలుస్తున్నారని చెప్పారు. పేద పిల్లలు చదువుకునేందుకు సకల వసతులతో దాదాపు వెయ్యి ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశారని చెప్పారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ప్రైవేట్ను ఆశ్రయించకుండా ఇంటర్మీడియెట్, డిగ్రీ కళాశాలలు సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు. గత పాలకులు కుల సంఘ భవనాలకు స్థలాలు, నిధులు ఇచ్చేవి కాదని, నేడు ప్రతి కుల సంఘానికి రాష్ట్ర రాజధానిలో స్థలంతో పాటు నిధులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. కులవృత్తుల్లో పూసల కుల వృత్తిదారులు అత్యంత వెనుబడిన సంచార తెగల వారని, ఎంబీసీలో చేర్చడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ధనిక రాష్ట్రం తెలంగాణ: వినోద్కుమార్
దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా నిర్మిస్తున్న బహుళ ప్రాజెక్టుల వల్ల రాష్ట్ర బడ్జెట్పై భారం పడుతున్నదని, త్వరలోనే అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పారు. ఇప్పటికే పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పండుతున్న పంటలకు తోడు, హైదరాబాద్కు తరలివస్తున్న పెట్టుబడులతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతున్నదని చెప్పా రు. వచ్చే బడ్జెట్లో ప్రతి పైసా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం వ్యయం చేసేలా ప్రభుత్వం పథకాలను రూపొందిస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఇక్కడ పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోనేటి రమేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి ఉన్నారు.