ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబుల్ బ్రిడ్జి అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసుకున్నది. కరీంనగర్ శివారులో 224 కోట్లతో నిర్మించిన తీగల వంతెనను మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించగా, మానేరు తీరం సరికొత్త శోభ సంతరించుకున్నది. డైనమిక్ లైటింగ్, క్రాకర్ షో వెలుగుల్లో వంతెన జిగేల్ మనగా, నగర ప్రజానీకం తిలకించి మురిసిపోయింది. మరోవైపు కళాకారుల నృత్యప్రదర్శనలను వీక్షించి సంబురపడింది.
కరీంనగర్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) / కార్పొరేషన్/ కమాన్చౌరస్తా/ కలెక్టరేట్/ తెలంగాణ చౌక్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబుల్ బ్రిడ్జికి బుధవారం అంకురార్పణ జరిగింది. కరీంనగర్ శివారు మానేరు నదిపై 224 కోట్లతో నిర్మించిన తీగల వంతెన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నది. అలాగే నగరంలో స్మార్ట్ సేవలందించేందుకు చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్, సమీకృత మార్కెట్, డిజిటల్ జిల్లా గ్రంథాలయంతోపాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా, సర్వత్రా హర్షం వ్యక్తమైంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం కరీంనగరంలో పర్యటించారు. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి దాదాపు 300 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు చేరుకున్న మంత్రి, ఆ తర్వాత కశ్మీర్గడ్డలో 10 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ పనులకు భూమి పూజ చేశారు. అక్కడి నుంచి జిల్లా గ్రంథాలయం చేరుకొని స్మార్ట్సిటీ కింద 7 కోట్ల వ్యయంతో చేపట్టిన స్మార్ట్ డిజిటల్ గ్రంథాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఉస్మాన్పురలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ జెమిని మల్టీ స్పెషాలిటీ దవాఖానను ప్రారంభించారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోల్కొండ హ్యాండ్క్రాఫ్ట్ షోరూంను ప్రారంభించారు. అక్కడి నుంచి కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం చేరుకొని 2 కోట్లతో నూతనంగా నిర్మించిన పౌర సేవా కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. అనంతరం స్మార్ట్సిటీలో భాగంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను, మూడో అంతస్తులో 2కోట్లతో నిర్మించిన నూతన నగరపాలక కౌన్సిల్ హాల్ను ప్రారంభించారు. మొదటి అంతస్తులోని మీటింగ్ హాల్ను ప్రారంభించి, పట్టణప్రగతిపై రూపొందించిన కాపీ టేబుల్ బుక్ను ఆవిష్కరించారు. అక్కడి నుంచి మానేరు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జికి చేరుకొని, బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం మానేరు రివర్ ఫ్రంట్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రాకర్ షో, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దాదాపు 10 నిమిషాల పాటు రంగుల రంగుల పటాకులు ఆకాశంలో మిరిమిట్లు గొలిపాయి.
కరీంనగర్లో బుధవారం పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్పై ప్రశంసలు కురిపించారు. గంగుల నేతృత్వంలో కరీంనగర్లో జరిగిన అభివృద్ధిని చూస్తే ప్రతిపక్షాల గుండెలు గుబేల్ మంటున్నాయని, ఇంత అంకితభావంతో పనిచేసే మంచి నాయకుడికి ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. దీంతోపాటు “కరీంనగర్ ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నదో మనం చూస్తున్నాం. జంక్షన్లు, రోడ్లు, ఎలా మారాయో మీ అందరి ముందు కనిపిస్తున్నాయి. కమలాకర్ ఎంత పట్టుదల గల నాయకుడంటే తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నీళ్లిచ్చే మొట్ట మొదటి నగరం కరీంనగర్ కావాలనే ధృఢ సంకల్పంతో పని చేస్తున్నారు. జీవన ప్రమాణాల విషయానికొస్తే ఇంతకు మించిన లక్ష్యం పెట్టుకున్న నాయకుడు నాకు తెలిసి భారత దేశంలో ఎవరూ లేరు. ఇటువంటి అద్భుతమైన నాయకుడు కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి కరీంనగర్ ప్రజలకు అండగా ఉండడం, కరీంనగర్ ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇలాంటి మంచి నాయకుడు దొరికినప్పుడు మళ్లీ ఆయనను గట్టిగా ప్రోత్సహించి వెన్నుతట్టి, ఆశీర్వదించి మేముంటాం మీ వెంట అని చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తీగల వంతెన గానీ, నాలుగు మంచి పనులు గాని, నాలుగు బడులు గానీ, మంత్రి గంగుల కమలాకర్ చేసినట్లు.. పదెకరాల్లో తిరుపతి తరువాత అంతటి గొప్ప గుడి కట్టే దమ్మున్న నాయకుడు కరీంనగర్ గడ్డపై ఎవరన్నా ఉన్నారా? అని చెప్పాలంటూ ప్రశ్నిస్తూ మంత్రి గంగులపై ప్రశంసలు కురిపించారు.
కరీంనగర్ అంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎనలేని ప్రేమను చాటుకుం టున్నారు. అడిగిన వెంటనే నిధులిస్తూ నగరాభివృద్ధికి సహకరిస్తున్నరు. వారి అండతోనే రూ. వేల కోట్లతో నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినం. ఇక్కడి మానేరుపై దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద కేబుల్ బ్రిడ్జిని నిర్మించినం. మానేరు రివర్ ఫ్రంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రపంచంలోనే మూడో అద్భుతమైన ఫౌంటేన్ను అందుబాటులోకి తెస్తున్నాం. వచ్చే ఆగస్టులో మానేరు రివర్ ఫ్రంట్లో నీళ్లు నిలిపితే ఫౌంటేన్ కొత్త శోభను సంతరించుకుంటుంది. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకున్నామని, ఈ జూన్ 21న మరో గొప్ప ప్రాజెక్టు కేబుల్ బ్రిడ్జ్ను ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉన్నది. టీటీడీ వేంకటేశ్వరస్వామి అలయం, మెడికల్ కాలేజీ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
– కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో మంత్రి గంగుల కమలాకర్..
ఉద్యమ నేత కేసీఆర్ 2014లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారి కరీంనగర్ పర్యటనకు వచ్చారు. కేసీఆర్ సూచనల మేరకు నగరాన్ని లండన్లా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇప్పుడిప్పుడే నాటి కలలు సాకారమవుతున్నాయం. ఉద్యమ సమయంలో నీళ్లు తెస్తామని తెచ్చామని, కోటిన్నర ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని చెప్పినట్టే చేస్తున్నారు.. వచ్చే వారం సియోల్ వెళ్లి అక్కడి ప్రపంచంలోనే అద్భుతమైన ఫౌంటేన్ నిర్మాణాన్ని చూసి వస్తాం. అదే మాదిరిగా ఇక్కడ కూడా నిర్మిస్తామని అన్నారు..
– కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్