కార్పొరేషన్, మే 21: కరీంనగర్లో టీటీడీ సహకారంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి సోమవారం ఉదయం భూక్షరణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గర్భాలయం నిర్మించే ప్రాం తాల్లో చేపట్టాల్సిన శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని, దీనిని తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. కరీంనగర్లోని కేసీఆర్ సర్క్యూట్ హౌస్లో ఆదివారం విలేకరుల సమావేశంలో తిరుమల ప్ర ధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగ మ వాస్తుశాస్త్ర సలహాదారులు మోహనరంగా ఆచార్యులతో కలిసి మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో కరీంనగర్ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు.
ఏ రాష్ట్రంలో అయినా టీటీడీ ఆ రాష్ట్ర రాజధానిలో ఒక ఆలయాన్ని మాత్రమే నిర్మిస్తుందన్నారు. తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో టీటీడీ ఆలయం ఉందన్నారు. సీఎం వినతి మేరకు టీటీడీ కరీంనగర్లోనూ ఆలయాన్ని నిర్మిస్తుందన్నారు. ఆలయ నిర్మాణానికి ఈ నెల 31న ఉదయం 6.50 నుంచి 7.20 గంటల మధ్యలో టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి భూ మిపూజ చేస్తున్నామని, దీనికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మా రెడ్డి జేఈవోలు, వేద పండితులు హాజరవుతారని వెల్లడించారు. కరీంనగర్ శ్రీవారి ఆలయాన్ని ఏడాదిన్నరలోగానే పూర్తి చేసి గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈనెల 31న నిర్వహించే ఆలయ భూ మిపూజ కార్యక్రమాన్ని పార్టీలకతీతంగా అందరిని ఆహ్వానిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ని కూడా ఆహ్వానిస్తున్నామన్నారు. అదే రోజు సాయంత్రం శ్రీవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ పవిత్ర కార్యంలో నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమమ ని దీనిని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. ఆలయ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి అందరూ ఆహ్వానితులేనని, పార్టీలకతీతంగా తరలిరావాలన్నారు. ఆలయం మొత్తం రాతి కట్టడంతో ఉంటుందని, ఈ రాయిని తమిళనాడు నుంచి తీసుకువస్తామన్నారు. తిరుమల తిరుపతి తరహాలో వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని, ఆ ప్రకారమే ఇకడి ఆలయంలో స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తారని తెలిపారు. గర్భాలయంతో పాటు ఇందులో ఉన్న బావి అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే ఇతర అన్ని సదుపాయాలు ఉండేలా సుందరంగా పనులు చేపడుతామన్నారు.
కలియుగంలో భక్తులను రక్షించేందుకే తిరుమలలో శ్రీవారు
కలియుగంలో భక్తులను రక్షించేందుకే శ్రీవారు తిరుమలలో వెలిశారని తిరుమల ఆల య ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అన్నారు. స్వామి వారి అనుగ్రహం ఉండడం వల్లే కరీంనగర్లో ఆలయ నిర్మాణ పను లు మొదలయ్యాయన్నారు. ఆలయ నిర్మాణ పనులకు 31వ తేదీన శంకుస్థాపన చేయనున్నప్పటికీ వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం ఈ నెల 22వ తేదీ సోమవారం ఉదయం మిథున లగ్నంలో భూకర్షణం చేసి పనులకు అంకురార్పణ చేయనున్నామన్నారు. 31న ఉదయం 7.20 గంటలలోగా ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతామన్నారు. అదే రోజున సాయంత్రం ఆలయ నిర్మాణ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నామన్నారు. తిరుమల తిరుపతి క్షేత్రంలో స్వామి వారికి ఎలాంటి కైంకర్యాలైతే చేపడుతారో అలాంటి సేవలను కరీంనగర్ శ్రీవారి ఆలయంలో చేపడుతామన్నారు. ఈ వేడుకల్లో ప్రజలందరు పాల్గొనాలని సూచించారు. ఈ సమావేశంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, తిరుమల ఆగమశాస్త్ర నిపుణులు సలహాదారులు మోహనరంగా, ఎగ్జిక్యూటివ్ ఇం జినీర్ నరసింహమూర్తి, కార్పొరేటర్లు రాజేందర్రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణ స్థలంలో పూజలు
కరీంనగర్లోని పద్మనగర్లో చేపట్టనున్న టీటీడీ దేవాలయం నిర్మాణ స్థలంలో టీటీడీ ప్రధాన ఆలయ అర్చకులు వేణుగోపాలదీక్షితులు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన, సద్యో అంకురార్పణ, రక్షా బంధనం, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు హోమం, వాస్తు పర్యాగ్నికరణ, యుగళాంగాళ పూజ, హారతి ప్రసాద వినియోగం తదితర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర మే యర్ సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్కుమార్ గౌడ్ , కార్పొరేటర్ బో నాల శ్రీకాంత్, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.