కలెక్టరేట్/ కరీంనగర్ రూరల్/కొత్తపల్లి, అక్టోబ ర్ 9: ‘సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నదని, అభివృద్ధిలోనూ దూసుకెళ్తున్నది. ముఖ్యమంత్రి ఆశయాలను అమలు చేయడంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాం, అర్హులందరికీ పథకాలు అందించడంలో పూర్తి గా సఫలీకృతులయ్యామని వివరించారు. నగరంలోని అరుందతీనగర్, 22, 25, 42 తదితర డివిజన్లలో మేయర్ సునీల్రావుతో కలిసి నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి గృహలక్ష్మి ఆర్థిక సాయం ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. అలాగే కరీంనగర్ మండలం నగునూర్లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మండలంలో 17 గ్రామాలకు చెందిన 882 మంది, కొత్తపల్లి మండలం చింతకుంటలోని ఎస్వీఆర్ ఫంక్షన్హాల్లో మండలంలోని 8 గ్రామాలకు చెందిన 381మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సంద్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు.
స్వరాష్ట్రంలోనే పేదల సొంతింటి కల సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. పేదలకు కుడుపు నిండా అన్నం, కట్టుకోవడానికి మంచి బట్ట, ఉండడాని ఇళ్లు అందిస్తున్న గొప్ప వ్యక్తి దేశం లో ఒక్క కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. కరీంనగర్లో బీఆర్ఎస్ స్పీడ్ను చూసి ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని, పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నాయని దుయ్యబట్టారు. కరీంనగర్ నియోజకవర్గం ప్రజలు తనను ఇంటి మనిషిగా చూస్తున్నారని, ఎక్కడికి వెళ్లినా ఆప్యాయంగా పలుకరిస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారని వివరించారు. పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గా తన శాఖకు సంబంధించి బీసీలు, పేదలకు అనేక సంక్షేమ పథకాలు వర్తింపజేయడంతో పాటు నగరంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం యొక్క ఫలాలు అత్యధిక సంఖ్యలో లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు మరింత మేలు చేసే క్రమంలో చేస్తున్న ప్రయత్నాలను సీఎం కేసీఆర్ కూడా ఆశీర్వదిస్తుండడంతో, నగర వాసులు ప్రతి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. ఇందుకు నిదర్శనమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కరీంనగర్కు, ప్రస్తుత నగరానికి తేడా గమనించవచ్చన్నారు. కేబుల్ బ్రిడ్జి, అందమైన కూడళ్లు, సెంట్రల్ లైటింగ్, సమృద్ధిగా తాగునీరు, సురక్షితమైన మురుగుకాల్వల వ్యవస్థ, అద్దాల్లాంటి రహదారుల నిర్మాణంతో నగర రూపురేఖలు మారిపోయాయన్నారు. హైదరాబాద్ లాంటి మహానగర అభివృద్ధితో కరీంనగర్ పోటీ పడుతూ, రాష్ట్రంలోని ఇతర నగరాలకు ఆదర్శంగా మారిందని పేర్కొన్నారు. నగరంలోని మానేరు రివర్ ఫ్రంట్ ప్రపంచ పర్యాటక పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని, ఈ ప్రగతిని చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తుతూ పారిపోతున్నాయన్నారు.
సీమాంధ్ర పాలకులతో బరిగీసి కొట్లాడి, తెచ్చుకున్న తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు. ఇది పరిపూర్ణం కావాలంటే తిరిగి కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు సీమాంధ్ర నాయకులు బుసలు కొట్ట డం ప్రారంభించారని, వీరిని ఆదిలోనే అడ్డుకుని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ బీ శ్రీనివాస్, కార్పొరేటర్లు ఎడ్ల సరిత, గందె మాధవి, గంట కళ్యాణి, బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల అశోక్, గంట శ్రీనివాస్, సర్పంచ్ ఉప్పుల శ్రీధర్, ఎంపీపీలు తిప్పర్తి లక్ష్మయ్య పల్లి శ్రీలత మహేశ్గౌడ్, జడ్పీటీసీ పిట్టల కరుణ రవీందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, ఎంపీటీసీలు సాయిల వినయ్సాగర్, అంకమల్ల శ్రీనివాస్, దిలీప్కుమార్, నెక్పాషా, రవి తేజ ఉన్నారు.