నాణ్యమైన విద్యుత్ సరఫరాలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సమైక్య పాలనలో కరెంటు లేక సాగు ఆగమైంది. పవర్హాలిడేలతో పరిశ్రమలు మూతపడి కార్మికులు వలసలు వెళ్లారు. ఎన్టీపీసీ , బొగ్గు, సింగరేణి, థర్మల్ పవర్ మనదే అయినా సమైక్య పాలకులు తెలంగాణను గుడ్డి దీపం చేశారు. కరెంటు ఉంటే నీళ్లు లేక.. నీళ్లుంటే కరెంటు లేక రైతులు అరిగోసపడి ఆత్మహత్యలు చేసుకున్నరు. అప్పుడు విద్యుత్ అధికారులు ప్రభుత్వాన్ని తిట్టలేక ఆత్మగౌరవం లేకుండా పనిచేసే పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో 24గంటల కరెంటు సరఫరా ఉంటున్నది. లోవోల్టేజీ సమస్య లేదు. లూజు లైన్లు లేవు. నాణ్యమైన విద్యుత్తో భూమికి బరువైన పంట పండుతున్నది. విద్యుత్ ఉద్యోగులు ఆత్మగౌరవంతో అద్భుతంగా పనిచేస్తున్నరు.
– కరీంనగర్లో జరిగిన విద్యుత్ ప్రగతి దినోత్సవంలో మంత్రి గంగుల కమలాకర్
ముకరంపుర, జూన్ 5: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కరీంనగర్లో ‘విద్యుత్ ప్రగతి దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించారు. కరీంనగర సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల బైక్ ర్యాలీని మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. దారి పొడవునా ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు, నృత్యాలతో ‘విద్యుత్ ప్రగతి దినోత్సవాన్ని’ నిర్వహించే రేకుర్త్తిలోని శుభం గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని దశాబ్ది ఉత్సవాల వేదిక ద్వారా చెప్పేందుకు అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సమైక్య పాలనలో కరెంటు లేక సాగు ఆగమైందన్నారు. పవర్హాలిడేతో పరిశ్రమలు మూతపడి వలసలు వెళ్లారని గుర్తు చేశారు. పక్కనే గోదావరి జలాలు గలగలా పారుతున్న తెలంగాణలో మాత్రం ఆగలేదన్నారు. ఎన్టీపీసీ, బొగ్గు, సింగరేణి, థర్మల్ పవర్ మనదే అయినా సమైక్య పాలకులు తెలంగాణను గుడ్డి దీపం చేశారని విమర్శించారు. పొద్దున లేస్తే కరెంటు ఆఫీసు చుట్టూ తిరిగి ధర్నాలు చేసే పరిస్థితి ఉండేదన్నారు. ఎమ్మెల్యేగా 2009లో ఎండిన వరి నారు, మక కంకులు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు, కాలిపోయిన వ్యవసాయ మోటర్లను ప్రతి అసెంబ్లీ సమావేశానికి తీసుకుపోయే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు.
నేడు నాణ్యమైన నిరంతర విద్యుత్
తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగులతో కలిసి కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నామన్నారు. నేడు విద్యుత్ ఉద్యోగులు ఆత్మగౌరవంతో పనిచేసే పరిస్థితి ఉందన్నారు. 24 గంటల కరెంటు సరఫరాతో విద్యుత్ ఉద్యోగుల కృషితోనే అంతా కంటి నిండా నిద్ర పోతున్నారని చెప్పారు. నాణ్యమైన విద్యుత్తో భూమికి బరువైన పంట పండిందన్నారు. 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. ఉద్యమకారుడు కేసీఆర్ పాలకుడై నీటి సంసరణలు చేశారని, కాళేశ్వరం నీటితో ఎండల్లోనూ చెరువులు మత్తడులు పారుతున్నాయని గుర్తు చేశారు. రైతులకు సాగునీరు, ఉచిత కరెంటు, రైతు బంధు ఇవ్వడంతో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి విద్యుత్ ఉద్యోగికీ అభినందనలు తెలిపారు.
వినియోగమే అభివృద్ధికి ప్రామాణికం
తలసరి విద్యుత్ వినియోగమే అభివృద్ధికి ప్రామాణికమని…. తొమ్మిదేళ్లలో జిల్లాలో తలసరి విద్యుత్ వినియోగం 1,179 యూనిట్లు పెరిగిందన్నారు. జిల్లా కేంద్రంలో గతంలో చిన్న గాలివానకే విద్యుత్ సరఫరా ఇబ్బందులు ఉండేవని, నగరానికి నలుదిక్కులా సబ్ స్టేషన్ల ఏర్పాటుతో ఆ కష్టాలు తప్పాయన్నారు. రాంనగర్-టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్డుపై ఉన్న స్తంభాన్ని తొలగించడంతో ఆ ప్రాంతంలో విశాలమైన రోడ్డు నిర్మాణం జరిగిందని చెప్పారు. ప్రతి నెల ఒకో రైతుపై ప్రభుత్వం రూ.10 వేల నుంచి 20 వేల వరకు రాయితీ రూపంలో రూ.50వేల కోట్లు వెచ్చించిందన్నారు. సీఎం కేసీఆర్ రజకులు, నాయీబ్రాహ్మణులకు బీసీ కార్పొరేషన్ ద్వారా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని, కులవృత్తులను కాపాడేందుకు రూ.లక్ష చొప్పున సహాయం అందించడానికి నిర్ణయించిందన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు విధి నిర్వహణలో అసువులు బాసిన విద్యుత్ ఉద్యోగులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ నివాళులర్పించారు.
సీఎం కేసీఆర్కు పూర్తి అవగాహన: మేయర్
నగర మేయర్ వై.సునీల్రావు మాట్లాడుతూ విద్యుత్పై సీఎం కేసీఆర్కు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, దానికి అనుగుణంగా అధికారులు నిబద్ధతతో శ్రమించి రాష్ట్రంలో వెలుగులు పంచుతున్నారని కొనియాడారు. విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వానికి గుండెలాంటి వారన్నారు. నగరంలో లైన్ విస్తరణతో పాటు లైటింగ్ పెరిగినా ఎక్కడా లోవోల్టేజీ సమస్య లేదన్నారు. విద్యుత్ అధికారుల కృషితో కరీంనగర్కు కొత్తందం వచ్చిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల కృషితోనే ప్రతి రోజు తాగునీటి సరఫరాను దిగ్విజయంగా నిర్వహిస్తున్నామన్నారు.
అధికారుల కృషితోనే ప్రథమ స్థానం: కలెక్టర్
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ పవర్ సెక్టార్తో పాటు ఇరిగేషన్, వెల్ఫేర్, ఇండస్ట్రీస్, వ్యవసాయంలో నంబర్ వన్గా నిలుస్తున్నామన్నారు. అధికారులు, సిబ్బంది నిరంతర శ్రమతోనే ఇది సాధ్యమైందన్నారు. స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ మాదిరిగా విద్యుత్ ఉద్యోగం నిరంతరం అప్రమత్తతతో కూడి ఉంటుందన్నారు. పల్లెపట్టణ ప్రగతితో అనేక పనులు పూర్తయ్యాయని చెప్పారు.
కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ వీ గంగాధర్ మాట్లాడుతూ విద్యుత్ ప్రగతి దినం పెద్ద పండగ అన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్కు చేతులెత్తి సమస్కారాలు తెలియజేస్తున్నానని చెప్పారు. జిల్లాలో తలసరి విద్యుత్ వినియోగం పెరిగిందని,. అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్రంగం పండుగలా మారిందని చెప్పారు. పరిశ్రమలు, వ్యవసాయం, పల్లెలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. గతంలో పరిశ్రమ వర్గాలు ఎక్కువ విద్యుత్ వాడితే పెనాల్టీ వేసే వారమని, ప్రస్తుతం ఎంతైనా వాడుకోవచ్చని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా సత్వర కనెక్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. రజకులు, నాయీబ్రాహ్మణులు, దోబీ ఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ఇస్తున్నట్లు తెలిపారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఈ సందర్భంగా కళాకారులు నిర్వహించిన ధూంధాం, చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యుత్ రంగంలో రాష్ట్ర, జిల్లాలో జరిగిన అభివృద్ధిపై రూపొందించిన చిత్ర ప్రదర్శన అందరినీ ఆలోచింప చేసింది. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, కరీంనగర్ రూరల్ ఎంపీపీ లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ నారాయణ, కొత్తపల్లి ఎంపీపీ శ్రీలత, జడ్పీటీసీ కరుణ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, రజక, నాయీబ్రాహ్మణ సంఘాల నాయకులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు, వినియోగదారులు తదితరులు ఉన్నారు.