కరీంనగర్ రూరల్, నవంబర్ 21: కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు భూమాఫియాలో భాగస్వాములని, వారి మాటలను ప్రజలు నమ్మవద్దని బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని గుంటూర్పల్లి, లక్ష్మీనగర్, కృష్ణనగర్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు భారీ ర్యాలీగా తరలివచ్చి డప్పుచప్పుళ్లు, బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలుకరించి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, పార్టీ టికెట్ ఇస్తానని చెప్పి బండి సంజయ్ రూ. కోట్లు వసూలు చేశాడని ఆరోపించారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యే గెలిచేందుకు ప్రజల ముందుకు మళ్లీ వస్తున్నాడని, బీసీ బిడ్డ తుల ఉమ పోటీ చేసేందుకు సిద్ధం కాగా ఆమెకు వ్యతిరేకంగా నిలిచి, కోట్ల రూపాయలకు టికెట్ అమ్ముకున్నాడని ఆరోపించారు. సంజయ్ ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి ఏదో ఒక డ్రామా ఆడి ఓట్లు దండుకోవాలని చూస్తాడని, ఆయన యాక్టింగ్లో నటుడు బ్రహ్మానందం, ప్రకాశ్రాజ్ను మించిపోయాడని ఎద్దేవా చేశాడు.
భూ మాఫీయాకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని, ఆయనకు సర్పంచ్గా అవకాశం ఇస్తే కబ్జాలు చేసిన వ్యక్తి ఎమ్మెల్యే అయితే మీ భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడని అన్నారు. తాను వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తే, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఏ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కబ్జాలతో బొమ్మకల్ గ్రామంలోని భూ రికార్డులు సీబీసీఐడీ వద్ద ఉండే దుస్థితి దాపురించిందని, 12 ఇండ్లు కట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి గ్రామ పంచాయతీ భవనం కట్టలేకపోయడని ఎద్దేవా చేశారు. ఎంపీగా బండి సంజయ్ని గెలిపిస్తే, ఒక్క రోజు కూడా గ్రామాలకు రాలేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడని మహిళలు నిలదీయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీటీసీ వెంగళదాసు శ్రీనివాస్, ర్యాకం లక్ష్మి, బీఆర్ఎన్ నాయకులు ర్యాకం మోహన్, దాడి సుధాకర్, జగన్ పటేల్, తోట కిరణ్, శంకర్, చింత శ్రీనివాస్, కాల్వ మల్లేశం యాదవ్, సాధవేణి రవియాదవ్, పెద్ది రమేశ్, సుంకిశాల సంపత్రావు, మాసినేని మారుతి, కాల్వ అశోక్, నేరెళ్ల ఆంజనేయులు, తిరుపతి రెడ్డి, మహేందర్రెడ్డి, బాబు, మల్లయ్య, సంపత్, సుధాకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.