కరీంనగర్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : ‘నాకు నా తల్లిదండ్రులు జన్మనిస్తే రాజకీయంగా మీరు జన్మనిచ్చారు. కేసీఆర్ కీర్తినిచ్చారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్లో జరిగిన బీఆర్ఎస్ కరీంనగర్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. 2001కి ముందు ఢిల్లీ నాయకుల కనుసన్నల్లో అనేక పార్టీలు పుట్టుకొచ్చాయని, కానీ ఏ పార్టీ కూడా తెలంగాణ కోసం పోరాడలేక పోయాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలతో ఢిల్లీ పాలకులు రాజకీయ క్రీడ ఆడుకున్నారని తెలిపారు.
తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నదని, రాష్ట్ర సాధనే ఏకైన ఎజెండాగా కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ను స్థాపించారని, సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. తాను కొత్తగా ఎమ్మెల్యే అయినపుడు కరీంనగర్ గుంతల రోడ్లు, కూలిపోయిన డ్రైనేజీలు ఉండి ఒక కుగ్రామంగా కనిపించేదని, పక్కనే మానేరు డ్యాం ఉన్నా జనం తాగు నీటి కోసం అల్లాడే వారని, నీళ్లుంటే కరెంట్ లేక, కరెంట్ ఉంటే నీళ్లు లేక రైతులు అష్టకష్టాలు పడేవారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిందని చెప్పారు. సీఎం కేసీఆర్కు ఇది సెంటిమెంట్ జిల్లా అని, ఎన్ని నిధులు అడిగినా కాదనకుండా ఇస్తున్నారని చెప్పారు. ఆయన ఆశీర్వాదంతో కరీంనగర్ ఎంతో అభివృద్ధి చెందిందని, కళోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, చివరికి సినిమా ఉత్సవాలకైనా కరీంనగరే గుర్తుకు వస్తున్నదన్నారు.
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ సిటీని నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కేబుల్ బ్రిడ్జి కోసం 150 కోట్లు కావాలని అడిగినపుడు ఒక్క క్షణం ఆలోచించకుండా మంజూరు చేశారని, రూ.వెయ్యి కోట్లతోని మానేరు రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేస్తున్నామని, 550 కోట్లతో పనులు నడుస్తున్నాయని, మరో నాలుగు నెలల్లో గొప్పగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇక్కడ ప్రపంచంలోనే మూడో స్థాయి ఫౌంటేన్ను నిర్మిస్తున్నామని, మొదటిది కొరియాలోని సియోలో ఉందని, రెండోది చైనాలోని సాంగయ్లో ఉందని, మూడోది ఇండియాలోని కరీంనగర్లోనే ఉంటుందన్నారు. కరీంనగర్ను సింగపూర్లా అభివృద్ధి చేసే బాధ్యతను సీఎం కేసీఆర్ తనకు అప్పగించారని మంత్రి వెల్లడించారు. వచ్చే నెలలో నగరంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టడంతోపాటు అన్ని ఐలాండ్స్ను ప్రారంభిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ మహిళల కోసం ముగ్ధుంపూర్లో అగ్రికల్చర్ బీఎస్సీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు 75 ఎకరాల భూమి అవసరం ఉండగా ప్రస్తుతం 40 ఎకరాల్లో కళాశాల నిర్మాణం జరుగుతోందన్నారు.
బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, మన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రభుత్వాన్ని కొనసాగించాలని కోరారు. మనం తప్పు చేస్తే మన బిడ్డల, తెలంగాణ భవిష్యత్తు అంధకారం అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రం ఢిల్లీ చేతులకుపోతే అధోగతి పాలవుతుందని, మన నీళ్లు, కరెంట్, బొగ్గు ఎత్తుకెళ్తారని, నిధులు పంచుకు తింటారని చెప్పారు. తాను ఎప్పటికీ తప్పు చేయకుండా, కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా పని చేస్తానని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. తనకున్న ఎజెండా తెలంగాణ అభివృద్ధి అని, కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపర్చాలని కోరారు. పార్టీపై వ్యతిరేక భావన ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలే కాదని, ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. మనం ప్రజల మధ్య ఉన్నామని, ప్రజల్లో కలిసి పోయామని, బీఆర్ఎస్లో ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులమని చెప్పారు. నియోజకవర్గంలో 3.30 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 30 వేల మంది ఇతర పార్టీల కార్యకర్తలు అయి ఉంటారని, మిగిలిన వాళ్లంతా మన వాళ్లుగా భావించి ప్రతి ఒక్కరినీ కలిసి ప్రభుత్వ పథకాలు వివరించాలని సూచించారు.
12 తీర్మానాలకు ఆమోదం
బీఆర్ఎస్ ప్లీనరీలో 12 తీర్మానాలను ఆమోదించారు. మొదటి తీర్మానంగా పట్టణ ప్రగతిపై మేయర్ వై సునీల్రావు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తూ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ నగరాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని నేలపై వాలి నమస్కరించారు. పార్టీలకతీతంగా అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తున్న ఘనత మంత్రి గంగుల కమలాకర్దని చెప్పారు.
మిగతా తీర్మానాలు
కరీంనగర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
గతంలో పట్టణాల అభివృద్ధి ప్రజలు చెల్లించే పన్నులు, ఫీజులపై ఆధారపడి జరిగేది. ఇప్పుడు పట్టణ ప్రగతి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇస్తున్నది. మూడేండ్లుగా కరీంనగర్కు 75 కోట్లు వచ్చాయి. ఈ నిధులతో ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాం. 15 చోట్ల అధునాతన టాయిలెట్లు నిర్మించాం. ప్రజల అహ్లాదం కోసం పార్కులు నిర్మిస్తున్నాం. 30 చోట్ల జిమ్స్ ఏర్పాటు చేశాం. మరో 30 జిమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. పారిశుధ్యం కోసం ఆధునిక యంత్రాలు కొనుగోలు చేశాం. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు తీసుకున్నాం. 7 కోట్లతో వైకుంఠధామాలను అభివృద్ధి చేశాం. 14 కోట్లతో అమృత వర్షిణి పేరుతో చక్కటి ఆడిటోరియం నిర్మిస్తున్నాం. ఇవే కాకుండా, మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ చొరవతో 347 కోట్ల సీఎం అస్యూరెన్స్ స్కీం నిధులతో నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. స్మార్ట్ సిటీ నిధులను సాధించి అభివృద్ధి చేస్తున్నాం.
– వై సునీల్రావు, కరీంనగర్ మేయర్