రెండు రోజులు ప్రధాని వద్దే ఉన్నా ఒక్కహామీ ఇప్పించలేకపోయావు
జబ్బలు చరిపించుకోవడం కాదు.. కరీంనగర్కు ఏం తెచ్చావో చెప్పు
ప్రభుత్వాన్ని కూల్చడం మీ తరం కాదు..
ముందుగా మీ ముగ్గురు ఎమ్మెల్యేలను కాపాడుకో
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల
రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే ప్రయత్నం : రసమయి బాలకిషన్
దమ్ముంటే కొండగట్టు అభివృద్ధికి నిధులు ఇప్పించు : సుంకె రవిశంకర్
“బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశలను వమ్ము చేస్తున్నారు. దేశ ప్రధాని వద్దే రెండు రోజులున్నా.. కరీంనగర్కు ఒక్క హామీ ఇప్పించుకోలేకపోయారు. ఇది ఆయన వైఫల్యానికి, ప్రజలపై పట్టింపులేనితనానికి నిలువెత్తు నిదర్శనం. జబ్బలు చరిపించుకొని మురిసిపోవడం కాదు.. నిన్ను గెలిపించిన ప్రజలకు ఏం చేశావో చెప్పాలి.” అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్తో కలిసి సోమవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, నేతల మాటలు, ప్రధాని మోదీ ప్రసంగాలు, బండి అసమర్థత వంటి అంశాలపై ఘాటుగా విమర్శలు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని సంజయ్ ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే రసమయి విమర్శించగా, దమ్ముంటే కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి కేంద్రం ద్వారా నిధులు ఇప్పించాలని మరో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు.
కరీంనగర్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో రెండు రోజుల పాటు ప్రధాని మోదీ హైదరాబాద్లో ఉన్నారని, ఆయన వెంటే ఉన్న బండి సంజయ్ ప్రధాని ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్క హామీ ఇప్పించలేకపోయారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల పాటు ప్రధానిని అంటిపెట్టుకొని ఉన్నప్పుడు.. ఏదో ఒక సందర్భంలో కరీంనగర్ అభివృద్ధి కోసం ఒక విన్నపం చేయాలన్న ఆలోచన కూడా బండి సంజయ్ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. బడాయిలు చెప్పడం కాదని, చిత్త శుద్ధి ఉంటే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి ద్వారా మానేరు రివర్ ఫ్రంట్కు రూ.410 కోట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.410 కోట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్వోబీల నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదని, జాతీయ రహదారులు పడకేశాయని మండిపడ్డారు.
మీటింగ్లో జబ్బలు చరిపించుకోవడం కాదని, ఎంపీగా ఎన్నుకున్న ప్రజల రుణం తీర్చడానికి ఏం ప్రయత్నం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాటి మాటికీ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామంటూ బడాయిలు మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులకు కేసీఆర్ను తిట్టడం, లేదా ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటూ ప్రగల్భాలు పలుకడం ఒక ఆనవాయితీగా మారిందన్నారు. దమ్ముంటే ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ముట్టిచూడాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడం బీజేపీ వల్ల కాదన్న మంత్రి.. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎటూ పోకుండా కాపాడుకోవాలని హితవుపలికారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు తలోదారి చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రధాని ద్వారా ఒక్క హామీ ఇప్పించలేకపోవడం మీ వైఫల్యానికి నిదర్శనం కాదా? అని సంజయ్ను ప్రశ్నించారు. ఎంత ధాన్యమైనా తామే కొంటామంటూ గతంలో సంజయ్తోపాటు కిషన్రెడ్డి ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు ఆ మాటలు మరిచిపోయారని పేర్కొన్నారు.
ఎవరిది కుటుంబ పార్టీ? : ఎమ్మెల్యే రసమయి
నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించిన బండి సంజయ్ మాటిమాటికీ కుటుంబ పార్టీ అంటూ టీఆర్ఎస్ను విమర్శించడం ఒక అలవాటుగా మార్చుకున్నారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ కవిత ఉద్యమ కాలంలో పనిచేసి.. తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన విషయం మీ కళ్లకు కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. స్వరాష్ట సాధనకోసం కేసీఆర్తో కలిసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొంటే.. ఆ విషయాన్ని పక్కన పెట్టి కుటుంబ పార్టీ అంటూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, వాస్తవాలు తెలిసిన తెలంగాణ ప్రజలు బీజేపీ నాయకుల విమర్శలను తిప్పి కొడుతున్నా.. వారికి సిగ్గు ఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని దృష్టిలో పడేందుకు బండి సంజయ్ ప్రయత్నించారే తప్ప.. రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ లోకసభ నియోజకవర్గానికి కనీస నిధులు ఇప్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. యాదాద్రి, సమ్మక్క సారలమ్మ గురించి ప్రధాని గొప్పగా చెప్పారని, దానికి అభినందనలు తెలుపుతున్నామని అయితే.. సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ఏ ఒక్క పథకమైనా మీ రాష్టాల్లో అమలు అవుతుందా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోస్తామని ప్రగల్భాలు పలుకడం మానుకోవాలని సూచించారు. దాదాపు 9 రాష్ర్టాల్లో బలవంతంగా ప్రభుత్వాలను కూల్చి మీకు అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని, అలాగే మత విద్వేషాలను రెచ్చగొడుతున్న మీ పాలనకు త్వరలోనే ప్రజలు అంతిమ వీడ్కోలు పలుకుతారని హెచ్చరించారు.
కొండగట్టుకు నిధులు తీసుకురా : ఎమ్మెల్యే సుంకె
యాదాద్రితోపాటు ఉమ్మడి జిల్లాలోని రాజరాజేశ్వర దేవస్థానం, ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి రాష్ట ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి అభివృద్ది చేస్తున్నదని, జై శ్రీరాం అని చెప్పుకునే మీరు దమ్ముంటే కొండగట్టు దేవస్థాన అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొని రావాలని సుంకె రవిశంకర్ సవాల్ విసిరారు. రైతు వ్యతిరేక చట్టాలపై నిరసన గళం వినిపించిన రైతులపై ఉగ్రవాద ముద్ర వేసిన, ప్రస్తుతం తెలంగాణలో తప్ప అన్ని రాష్ర్టాల్లో మోటర్లకు మీటర్లు పెడుతున్న బట్టే బాజ్ పార్టీ బీజేపీ అని ధ్వజమెత్తారు. బీజేపీకి దమ్ముంటే.. కాళేశ్వరం వంటి ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేసి చూపించాలని డిమాం డ్ చేశారు. రైతు బీమా, రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను అమలు చేసి, సంక్షేమ రంగానికి కొత్త అర్థం చెబుతున్న సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఘాటు గా హెచ్చరించారు. యువతను ప్రలోబాలకు గురిచేసి మత విద్వేషాలను రెచ్చ గొడుతున్న తీరు యావ త్ దేశ ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాసు, మేయర్ సునీల్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డితోపాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.