కోర్టుచౌరస్తా, మార్చి 23: సమాజంలో మేధావివర్గంగా బాధ్యత గల వృత్తిలో ఉన్న న్యాయవాదుల సంక్షేమాభివృద్ధి కోసం తనవంతు కృషి చేయనునట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు గురువారం జిల్లా కోర్టుకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయవాదుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. న్యాయవాదులు చిరకాలంగా ఎదురుచూస్తున్న ఇండ్ల స్థలాలకు నెల రోజుల్లో స్థలాన్ని కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో నిర్మాణం చేపట్టనున్న మహిళా బార్ అసోసియేషన్, కాన్ఫరెన్స్హాల్కు రూ.20 లక్షలు, గ్రంథాలయానికి రూ.10 లక్షల మంజూరు పత్రాలను అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి అందించారు.
రెండు కోర్టు భవనాల మధ్య వాకర్ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిషారానికి పార్టీలకతీతంగా ఒక ఎమ్మెల్యేగా ముందుంటానని తెలిపారు. కరీంనగర్ నగర అభివృద్ధి కోసం గత ముఖ్యమంత్రులను రూ.రెండు కోట్లు అడిగినా ఇవ్వలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మూడో రోజునే రూ.100 కోట్లు మంజూరు చేశారని, అప్పటి నుంచే కరీంనగర్ పట్టణాభివృద్ధి ప్రారంభమైందని గుర్తు చేశారు.
కరీంనగర్పై ప్రత్యేక శ్రద్ధ ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రజలకు సాయంత్రం వేళల్లో, సెలవు దినాల్లో అహ్లాదాన్ని అందించే కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్కు నిధులు ఇచ్చారని, త్వరలోనే ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వీటితో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పదెకరాలలో వెంకటేశ్వరస్వామి టెంపుల్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయని వివరించారు. అన్ని రంగాల్లో కరీంనగర్ నగర అభివృద్ధి జరుగుతున్నదని, భావితరాలకు గొప్ప నగరాన్ని అందివ్వాలని తన వంతు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను తెలుపగానే వెంటనే స్పందించి వాటికి నిధులు మంజూరు చేయించడంతోపాటు తమకు ఎల్లవేళలా అండగా ఉంటానన్న మంత్రి గంగులకు ఈ సందర్భంగా న్యాయవాదుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బార్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని సన్మానించారు. ఇక్కడ నగర మేయర్ సునీల్ రావు, రాష్ట్ర సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎం అనిల్ కుమార్, బాస సత్యనారాయణ, పీవీ రాజ్ కుమార్, బీ రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, గవర్నమెంట్ ప్లీడర్ కేవీ వేణుగోపాల్ రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గౌరు రాజిరెడ్డి, గడ్డం లక్ష్మణ్, సీనియర్ జూనియర్, మహిళా న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.