మిగ్జాం తుఫాన్ భయపెడుతున్నది. నాలుగు రోజులుగా ఒకటే ఇగం పెడుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడం, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదవుతుండడంతో చలి పులి మరింత భయపెడుతున్నది. ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా పొగ మంచు కమ్ముకుంటున్నది. దీనికి తోడు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల పవనాలతో మరింత వణుకు పుడుతున్నది. మరోవైపు రోజంతా ఈదురు గాలులు వీస్తుండడంతో జనం బయటికి రావాలంటేనే జంకుతున్నది. సాయంత్రమైతే గజగజ వణుకుతున్నది.
– కరీంనగర్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : మిగ్జాం తుఫాన్ ప్రభావం తగ్గినా చలి మాత్రం వీడడం లేదు. ఉత్తరాది ప్రాంతం నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో జిల్లాలో వణుకు పుట్టింది. ఎక్కడ చూసినా జనం ఇగంతో గజగజా వణికిపోతున్నది. నవంబర్ నెల చివరి నుంచే చలి తీవ్రత పెరుగుతున్నది. ముఖ్యంగా ఈ నెల 4 నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
మూడు నాలుగు రోజుల పాటు మిగ్జాం తుఫాన్ కారణంగా వర్షాలు కురిశాయి. దీంతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఈదురు గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి కనిపించింది. ఈ నెల 6న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం స్థాయిని దాటి పడిపోయాయి. ఆ రోజు 23 డిగ్రీలకు చేరుకున్నాయి. జిల్లాలో సాధారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 23 డిగ్రీలు నమోదవుతాయి. ఈ నెల 6 నుంచి 20కి పడిపోయాయి. శుక్రవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు కూడా 28 దాటడం లేదు.
సాధారణంగా డిసెంబర్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. మిగ్జాం తుఫాన్ కారణంగా వారం నుంచి విపరీతంగా చలి పెరిగింది. వారం పది రోజుల కిందటి వరకు పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు లేక పోవడంతో చలి తీవ్రత సాధారణంగానే ఉంది. ప్రతి శీతాకాలం సీజన్లో ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తుంటాయి. సీజన్ పూర్తయ్యే వరకు కనీసం రెండు మూడు విడుతల్లో ఈ శీతల గాలుల ప్రభావం ఉంటుంది. ఈ సీజన్లో ఈ గాలులు వీస్తుండడం ఇదే మొదటి సారి.
దీనికి తోడు తుఫాన్ ప్రభావం చూపింది. ఈ కారణంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. నాలుగైదు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడాలు వస్తున్నాయి. ఈ నెల 6 నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 20కి పడిపోయాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 23 నుంచి 28 డిగ్రీలకు తగ్గుతుండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే రీతిలో వాతావరణం ఉంటున్నది. నవంబర్ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32 నుంచి 31 డిగ్రీలు నమోదయ్యాయి. వారం పది రోజులుగా ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తుండటం, తుఫాన్ ఏర్పడడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే రీతిలో వాతావరణం కనిపించడం, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో జిల్లా ప్రజలు వణికి పోతున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొన్నది. రాత్రి వేళ 20 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొద్దంతా ఎవరి విధుల్లో వారు బయటికి వెళ్తున్న జనం సాయంత్రం కాగానే ఇండ్లకు చేరుతున్నారు. రాత్రిళ్లు విరివిగా మంచుకురుస్తోంది. దీంతో రాత్రి వేళ బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. రాత్రి పూట చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఇక ఉదయం 8 గంటల వరకు దుప్పటి ముసుగు తీయడం లేదు.
జిల్లాలోని అనేక ప్రాంతాలు ఉదయం పది గంటల వరకు మంచుకప్పుకుని ఉంటోంది. దీనికి తోడు గాలిలో 42 శాతం తేమ ఉంటోంది. గంటకు 7 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో చలి గాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం కాస్త వాతావరణం పొడిగా అనిపించి వెచ్చదనం కనిపిస్తున్నా సాయంత్రం 4 గంటల నుంచే చలి ప్రభావం కనిపిస్తోంది. ఉదయం దిన చర్యలు ప్రారంభించే పాల వ్యాపారులు, పేపర్ బాయ్స్, చాయ్ దుకాణావాలాలు, కూరగాయల వ్యాపారులు చలిలో వణుకుతూనే పనులు ప్రారంభించుకోవల్సి వస్తున్నది.
చలి తీవ్రత పెరగడంతో ఉన్ని దుస్తులకు విపరీతమైన గిరాకీ పెరిగింది. నగరంలోని పలు చోట్ల ఉన్ని దుస్తుల అమ్మకాలు సాగుతున్నాయి. అస్సాం, నేపాల్, మిజోరాం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులకు ఈసారి పంట పండుతోంది. దుప్పట్లు, జర్సీలు ఎక్కడ పడితే అక్కడ విక్రయిస్తున్నారు.
చలి తీవ్రత పెరగడంతో ఉన్ని దుస్తులకు అమాంతం ధరలు పెంచినా తప్పని పరిస్థితిలో కొనక తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్, తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉన్ని మార్కెట్లో జనం పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. పిల్లలకు, తమకు అవసరమైన దుస్తులు కొనుగోలు చేసుకుంటున్నారు. హైవేల వెంట, నగర శివార్లులో కూడా ఈసారి ఉన్ని దుస్తులు విక్రయిస్తున్నారు.
ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తుండడంతో ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులు మరి కొద్ది రోజులు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రాబోయే పది రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 25డిగ్రీలకు పడిపోవచ్చని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 20 నుంచి 15 వరకు పడిపోతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చలికి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని మరో పక్క వైద్యులు కూడా సూచిస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నపుడు చిన్న పిల్లలు, వృద్ధులు, అస్తమా వ్యాధి గ్రస్తులు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.