Alaya Foundation | కోల్ సిటీ, మార్చి 1 : తలసేమియా చిన్నారుల కోసం ఆలయ ఫౌండేషన్ వలంటీర్లు రక్తదానం చేశారు. ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి పుట్టిన రోజు సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఐత శివకుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఎల్బీ నగర్ లో ఆదివారం మెగా రక్తదాన శిబిరం చేపట్టారు. ఫౌండేషన్ సభ్యులు, స్వచ్ఛంద సంఘాల సభ్యులు, యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.
ఈ శిబిరం ద్వారా సుమారు 75 యూనిట్ల రక్తం సేకరించిన మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీకి అందజేసినట్లు నిర్వాహకుడు ఐత శివ తెలిపారు. అలాగే రిటైర్డ్ ఆర్మీ సైనికులను శాలువాలతో సన్మానించి వారి సేవలను గుర్తు చేసుకున్నారు. సమాజ హిత కార్యక్రమాలు చురుకుగా చేపడుతున్న రామగుండం నియోజక వర్గ స్వచ్చంద సంఘాల ఐక్య వేదిక కార్యవర్గాన్ని సన్మానించి సేవలను కొనియాడారు. అలాగే లంక సురేశ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పుస్తకాలు పంపిణీ చేశారు.
పలువురు వక్తలు మాట్లాడుతూ మధ్యప్రదేశ్ లో ఐఏఎస్ అధికారిగా ఉన్నత పదవిలో ఉండి కూడా పుట్టిన గడ్డను మరవకుండా తెలంగాణలో ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న పరికిపండ్ల సరహరి స్ఫూర్తిగా ఆయన పుట్టిన రోజున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయని నిర్వాహకులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విజయానంద్, గోలివాడ చంద్రకళ, కానుగంటి శ్రీనివాస్, లంక సురేశ్, శ్రీదేవి, సుజాత, సాయిలక్ష్మి, నాగరాజు, నిఖిల్, దేవ, శ్రీధర్, సతీష్, ఉదయ్, చారి, బెల్లి సంపత్, శ్రీనివాస్ తోపాటు అధిక సంఖ్యలో స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.