ఓ వైపు వేములవాడ రాజన్న, మేడారం సమ్మక్క దర్శనాలు.. మరోవైపు శుభ ముహూర్తాలు, అత్యధిక పెండిళ్లు, శుభకార్యాలు.. ఇంకోవైపు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోనే అతిపెద్దదైన కరీంనగర్ బస్స్టేషన్ బుధవారం ఇసుకేస్తే రాలనంత మందితో రద్దీగా మారింది.
అయితే, తగినన్ని బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఒకవేళ బస్సులు వచ్చినా పరిమితికి మించి మంది ఉండడంతో సీట్ల కోసం అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఎదురైంది. బస్సులు ప్లాట్ఫామ్పైకి రాకముందే రన్నింగ్లో ఉన్నప్పుడే సీట్ల కోసం కిటికీలోంచి ఖర్చీఫ్లు, బ్యాగులు వేయడం వంటివి చేశారు. మరికొందరు డోర్ల దగ్గర నెత్తిలో ముల్లెమూట, చంకలో చిన్నారులతో బస్సు ఎక్కేందుకు అవస్థలు పడ్డారు.
– కరీంనగర్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్