కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 3: ‘ప్రజలకు అందుబాటులో లేని, అభివృద్ధిని పట్టించుకోని బండి సంజయ్కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానమే దక్కుతుంది’ అంటూ నగర మేయర్ యాదగిరి సునీల్రావు జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. బీజేపీకి ఓటేస్తే మోరిలో వేసినట్టేనని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేండ్లు ఎంపీగా పనిచేసిన సంజయ్ కనీసం నియోజకవర్గంలోని మండలాలకు వెళ్లలేదన్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థినని చెప్పుకున్న ఆయనను ప్రజలు తిరస్కరించారని గుర్తుచేశారు. ఇది తెలుసుకోకుండా ప్రగల్బాలు పలుకుతున్నాడని మండిపడ్డారు. దేశంలో 350 సీట్లతో అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారన్నారు. బండి సంజయ్కి లోక్సభ టికెట్ ఇవ్వద్దంటూ ఆ పార్టీ నాయకులే చెబుతున్నారని గుర్తుచేశారు. ఇదంతా సంజయ్ స్వయంకృతాపరాధమన్నారు.గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయాడనే సానుభూతితో ప్రజలు ఎంపీగా బండి సంజయ్ని గెలిపించారని, కానీ అన్నిసార్లు సానుభూతి పనిచేయదన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. రైతుబంధు రాక, కరెంట్ అందడంలేదనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసినా ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. ఇదే తీర్పు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పునరావృతమవుతుందన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు చాడగోండ బుచ్చిరెడ్డి, వాల రమణరావు, కంసాల శ్రీనివాస్, నేతికుంట యాదయ్య, గందె మాధవి, నాయకులు పవన్ పాల్గొన్నారు.