కార్పొరేషన్, ఫిబ్రవరి 2: జిల్లాకు ఏమి తెలియని, అవగాహన లేని దద్దమ్మ ఎంపీ ఉండడం వల్లే కేంద్ర బడ్జెట్లో కరీంనగర్ జిల్లా ఒక్కటి రాకుండా మొండి చేయి చూపించారని బండి సంజయ్పై నగర మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు. జిల్లా ప్రజలు ఎంతో ఆశలతో ఎదురుచూస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా కేంద్రం నుంచి రాలేదని విమర్శించారు. బడ్జెట్లో కనీసం ఒక్కటి కూడా రాలేదంటే అది ఆయన ఘనతేనన్నారు. కరీంనగర్ ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న కరీంనగర్, వరంగల్ రైల్వేలైన్, గతంలో మంజూరైన మనోహరాబాద్, కొత్తపల్లి లైన్కు సంబంధించి ఏమి సాధించలేకపోయారని దుయ్యబట్టారు. గతంలో ఎంపీగా వినోద్కుమార్ కరీంనగర్కు అనేక జాతీయ రహదారులు మంజూరు చేయిస్తే కనీసం వాటిలో కిలోమీటర్ రోడ్డు వేయలేకపోయిన దిక్కుమాలిన ఎంపీ బండి సంజయ్ అని విమర్శించారు. పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వేలైన్ ఎంపీగా ఉన్న సమయంలో వినోద్కుమార్, కవిత ఎంతో కృషి చేసి వేగంగా పూర్తి చేయించారని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఈ నాలుగేళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేకపోయిన ఎంపీ ఉండడం జిల్లా దురదృష్టకరమన్నారు.
ఈ నాలుగేళ్ల కాలంలో ఎంపీగా బండి సంజయ్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం దేశాన్ని ఎలా అప్పుల కుప్పగా మార్చుతుందో బడ్జెట్ లెక్కలే చెబుతున్నాయన్నారు. రాష్ట్రం అప్పులు చేస్తుందని చెబుతున్న బండి సంజయ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి రోజు రూ.3456 కోట్ల అప్పు చేస్తున్నది కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 33 శాతం అప్పులే చూపించారని, వాటిల్లో 25 శాతం వడ్డీలే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఇన్ని అప్పులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు, పరిశ్రమలు స్థాపించిందో చెప్పాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఏం కార్యక్రమాలు తీసుకున్నారని నిలదీశారు. గతంలోని ప్రభుత్వం స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగుల పొట్టకొట్టడం తప్ప ఏం సాధించారని నిలదీశారు. బడ్జెట్లో ఈ ఏడాది ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి రూ.60 వేల కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం బీజేపీ అని విమర్శించారు.
ఎన్నికలు ఉన్న రాష్ర్టాలకు నిధులు మంజూరు చేసి రాజకీయాలు చేయడం తప్ప ప్రజల అభ్యున్నతి కోసం ఏం సాధించారని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి మాట్లాడేశక్తి లేనివారు, పరిజ్ఞానం లేని వారు జిల్లాకు ఎంపీగా ఉండడం దురదృష్టకరమన్నారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోతలు విధించారని దుయ్యబట్టారు. ప్రజలకు ఏమాత్రం లాభం చేయలేని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, వాల రమణారావు, చాడగొండ బుచ్చిరెడ్డి, గుగ్గిళ్ల జయశ్రీ, నేతికుంట యాదయ్య, భూమాగౌడ్, నాయకులు మేచినేని అశోక్రావు, ఉయ్యల శ్రీనివాస్గౌడ్, వేణు తదితరులు పాల్గొన్నారు.