తిమ్మాపూర్ రూరల్, అక్టోబర్27 : కాంగ్రెస్ గ్యారంటీలను నమ్ముకుంటే గ్యారంటీగా ఆగమవుతామని మానకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ హెచ్చరించారు. నియోజకవర్గం, గ్రామాలను ఎంతగానో అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. శుక్రవారం రాత్రి తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పుడు సంక్షేమం, గ్యారంటీల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు 50 ఏండ్లు పాలించినప్పుడు ఏమైందని ప్రశ్నించారు.
వారి మాటలు నమ్ముకుంటే నట్టేట ముంచుతారని ఎద్దేవా చేశారు. రైతులకు రైతుబంధు వద్దన్న కాంగ్రెస్ నాయకులు ఏ మొఖం పెట్టుకొని రైతులను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం వస్తే గల్లా పట్టుకని నిలదీయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఉన్న క్లిష్ట పరిస్థితులను, రేణిగుంటకు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రతి కుల సంఘానికి బిల్డింగ్ నిర్మించానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసిందని వృద్ధులు, రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. మరోసారి ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందు ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
పూల వర్షం కురిపిస్తూ బోనాలు, బతుకమ్మలు, చేపల వలల పట్టుకుని సభకు తీసుకెళ్లారు. పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరగా ఎమ్మేల్యే గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. సర్పంచ్ బోయిని కొమురయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ల్యాగాల వీరారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, ఇనుకొండ జితేందర్రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలుక ఆంజనేయులు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.