పెద్దపల్లి, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లా మక్క సాగుకు అనుకూలంగా ఉండడంతో రైతులు ఈ పంటపై ఆసక్తిచూపుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈ యాసంగి రెట్టింపుగా సాగు చేశారు.
సాగు విధానం
రేగడి, ఎర్ర, నల్ల, ఇసుక మట్టి నేలలు అనుకూలమైతే ఒక్కో నేలకు ఒక్కో విధంగా సాగు విధానం, నీటి యాజమాన్య పద్ధతులు ఉంటాయి. పంట చేనులో అడుగుమందు వేసుకొని సాగు మొదలు పెట్టాలి. పిలక వచ్చిన తర్వాత మొక్కకు మొగిళ్లలో సిమ్మట వేయాలి. ఇది ప్రమాదకరమైన పంటను నాశనం చేసే కత్తెర పురుగును నివారిస్తుంది. ఇలా 10-15 రోజులకు ఒక నీటి తడుపు చొప్పున 120 రోజుల పాటు సాగునీరందించాలి. ఆ తర్వాత వారం రోజుల పాటు ఎండలో ఎండపెట్టాలి. ఆ తర్వాత వాటిని మేజ్ మిషన్లో వేస్తే గింజకు గింజ, కంకి బొడ్డెకు బొడ్డె వేరు చేస్తుంది.
ఇలా వచ్చే మక్కలను నేరుగా విక్రయించవచ్చు. మక్కకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.1962గా నిర్ణయించి ధర చెల్లిస్తున్నది. అయితే, పౌల్ట్రీ రైతులు, మక్క చుడువ, మక్క పేళాలు చేసే కంపెనీల వారు మద్దతు ధరకు మించి పోటీ పడి రూ.2000ల నుంచి రూ.2100 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ఎకరానికి ఖర్చు రూ.25,000ల వరకు అవుతుండగా సాధారణంగా ఒక ఎకరాకు 35 క్వింటాళ్ల వరకు సాగవుతున్నది. అన్ని ఖర్చులూ పోను రైతులకు ఎకరాకు రూ.40 వేల వరకు ఆదాయం సమకూరుతున్నది.
సాగులో అప్రమత్తంగా ఉండాలి
దుక్కిలో సేంద్రియ ఎరువు వేస్తేనే మక్క పంట బాగా పండుతుంది. లేకపోతే దిగుబడి రాదు. కత్తెరపురుగు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సాగుకు వరిలాగా పెద్ద రిస్క్ ఉండదు.. కానీ, కోతులు, పిట్టల నుంచి పంటను కాపాడుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో మక్కకు మంచి డిమాండ్ ఉన్నది. బాధ లేదు.
– కంకణాల కొమురయ్య, రైతు, గుండ్లపల్లి, సుల్తానాబాద్ మండలం
మక్కలు పట్టినందుకు క్వింటాలుకు రూ.40
మైజ్ మిషిన్తోటి మక్కలు పట్టాలంటే క్వింటాలుకు రూ.40 తీసుకుంటున్నం. మక్క కంకులు పోస్తే ఒక వైపు మక్కలు, మరో వైపు కంకి బొడ్డెలు, ఇంకో వైపు డస్ట్ వస్తుంది. మక్కలు పూర్తిగా శుభ్రమై వస్తాయి. ప్రతి వేసవిలో రైతులు మక్కల మిషన్లను తెప్పించుకుంటారు. ఒక్కో రైతు దగ్గర వాళ్లు పండించిన పంటను బట్టి గిట్టుబాటవుతుంది. ఎకరాకు రూ.1500ల వరకైతే వస్తయ్.
– ఉప్పు కోటేశ్, ట్రాక్టర్ మిల్లర్, మంచెరామి, సుల్తానాబాద్ మండలం