మల్లాపూర్, ఏప్రిల్ 1 : మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో సర్కారు జాప్యంపై మక్క రైతులు కన్నెర్ర జేశారు. వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్లాపూర్ మండలకేంద్రంలోని ప్రధాన రహదారిపై మక్కలు పోసి, ధర్నా చేశారు. సుమారు రెండు గంటల పాటు అక్కడే బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతోపాటు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. రైతులను గోస పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు.
సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, ఏఎస్ఐ లచ్చయ్య అక్కడకు చేరుకొని ఆందోళన విరమింపజేశారు. ధర్నాలో రైతులతోపాటు పార్టీ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాజీ సింగిల్విండో చైర్మన్ కాటిపల్లి ఆదిరెడ్డి, మాజీ మార్కెట్కమిటీ చైర్మన్ కదుర్క నర్సయ్య, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, నాయకులు దేవ మల్లయ్య, గౌరు నాగేశ్, ముద్దం శరత్గౌడ్, గణవేని మల్లేశ్, భూక్య గోవింద్నాయక్, బద్దం అంజిరెడ్డి, సయ్యద్ హైదర్, న్యామతేబాద్ రాజు, మ్యాకల సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
ఆందోళనలు ఉధృతం చేస్తం
రెండు రోజుల్లో ప్రభుత్వం గ్రామాల్లో మక్కల కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. లేదంటే బీఆర్ఎస్ తరపున జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తం. గ్రామాల్లోని రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి రోడ్లెక్కుతం. వంటావార్పు చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తం.
– తోట శ్రీనివాస్, బీఆర్ఎస్ మల్లాపూర్ మండలాధ్యక్షుడు
కొనుగోళ్లలో విఫలం
మక్కల కొనుగోళ్లలో రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైంది. రైతులను కాంగ్రెస్ నట్టేట ముంచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరితమైన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్రెడ్డికి ఆటలు, అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ఆరుగాలం కష్టపడే రైతులపై ఏమాత్రం లేదు. కల్లాల వద్ద పోసిన మక్కల కుప్పల వద్ద రైతులు పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఈదురుగాలులతో మామిడి, నువ్వు, వరి పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి. వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే మరిన్ని ఆందోళన చేస్తాం.
– దావ వసంత, జడ్పీ మాజీ చైర్పర్సన్
హామీలను మరిచింది
ఎన్నికల్లో రైతులకు అడ్డగోలు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని మరిచిపోయింది. రైతుల సమస్యల పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. రైతులు పంటలు పండించడానికి ఎంత కష్టపడుతున్నారో, దానిని అమ్ముకోవడానికి అంతకంటే ఎక్కువగా శ్రమపడుతున్నరు. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వాలూ బాగు పడలేదు.
– సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాజీ జడ్పీటీసీ