Odela | ఓదెల, ఫిబ్రవరి 10 : పెద్దపల్లి జిల్లాలో ప్రధాన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 12 నుంచి మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆలయ పాలకవర్గం, సిబ్బంది ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శివుడు పంచభూతాలకు అధిపతి, సర్వప్రాణ కోటికి ఆధార భూతమై శైవ క్షేత్రంలో మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలం లాంటిది ఓదెల క్షేత్రం. శివ భక్తి పారవశ్యతను ప్రసాదిస్తూ సకల లోక మానవాళి సంరక్షణకు మల్లికార్జున స్వామి భ్రమరాంబ సమేతంగా వెలసినట్లు పండితులు చెబుతుంటారు.
ఈ ఆలయం అతి పురాతనమైనది. దాదాపు 1330 కి చెందిన కాకతీయుల వంశం వారు నిర్మించినట్లు భావిస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయి. ఇందుకు ఆలయ పాలకవర్గం, సిబ్బంది అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిస్తున్నారు.
ఈనెల 12వ తేదీన అగ్రోదకము, మహాగణపతి పూజ, గౌరీ పూజ, అఖండ దీపారాధన, సాయంత్రం ధ్వజారోహణము, శివయాగ మండప స్థాపన, ప్రధాన కలశ స్థాపన పూజా కార్యక్రమాలు ఉంటాయి. 13న ఉదయం 10:30 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఇందులో పాల్గొనే భక్తులు ఉదయం 8 గంటలకు దేవస్థానం కు రావాల్సిందిగా ఆలయ సిబ్బంది కోరుతున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే సిహెచ్ విజయ రమణారావు స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. 14న నాకబలి గ్రామోత్సవం, 15న మహాశివరాత్రి వేడుకలు రాత్రి 11:45 గంటలకు లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు ఉంటాయి. 16న నిత్య ఉత్సవము, స్థాపిత మంటపారాధన, పూర్ణాహుతి, కలశ ద్వాసన తదితర పూజలు జరగనున్నాయి.