వేములవాడ, మార్చి 26: జిల్లాతోపాటు వేములవాడ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు తెలిపారు. లయన్స్ క్లబ్, జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం యశోద దవాఖాన వైద్య బృందంతో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపునకు ఆయన హాజరై ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ లాంటి నగరాలను వీడి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన వైద్యులను ఆయన అభినందించారు.
లయన్స్ క్లబ్, వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఇంత గొప్పగా కార్యక్రమం చేయడం అభినందనీయమని వారిని ప్రశంసించారు. జిల్లా ప్రజలతోపాటు వేములవాడ ప్రాంత ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించే విధంగా అత్యాధునిక వసతి సదుపాయాలతో ప్రభుత్వ దవాఖానలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఉచిత మెగా హెల్త్ క్యాంపులో 600 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పెంచలయ్య, కోశాధికారి డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్, వేములవాడ పట్టణ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్, వైద్యులు నామాల ప్రదీప్, శివకుమార్, ఆనందరెడ్డి, నాగ రమేశ్, అనంత్ రెడ్డి, తేజస్విని, సింధు అనిత, లయన్స్ క్లబ్ ప్రతినిధులు తీగల వెంకటేశ్వర్ రావు, కోళ్ల శ్రీనివాస్, ఎడవల్లి రాజశేఖర్, కొడిమ్యాల పురుషోత్తం, అన్వర్, నిజాం నరేందర్, సంపత్, సందీప్ తదితరులు ఉన్నారు.