ఈ నెల 12న కరీంనగర్లో జరిగే కదనభేరికి పెద్ద సంఖ్యలో తరలివెళ్లి సూపర్హిట్ చేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి జైత్రయాత్ర ప్రారంభిస్తున్నదని, గట్టిగా కొట్లాడి కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని సూచించారు. ఆదివారం గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ మండలస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
– సిరిసిల్ల/ గంభీరావుపేట, మార్చి 10
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలు, ప్రజలు చాలా బాధతో ఉన్నారని, కేసీఆర్ సీఎంగా లేని తెలంగాణను చూడలేమని ఆవేదన చెందుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యనించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిజం గడప దాటక ముందే అబద్దం రాజ్యమేలినట్లయిందని వివరించారు. ఆచరణకు నోచుకోని 420 హామీలను ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కిందని, అడ్డగోలుగా అబద్దాలు ప్రచారం చేసినా సిరిసిల్ల ప్రజలు, కార్యకర్తలు తనను గుండెల్లో పెట్టుకుని విజయాన్ని అందించారని గుర్తు చేశారు.
గంభీరావుపేట మండలం తనకు 3800 మెజార్టీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో తనకు మంచి మెజార్టీ ఇచ్చారని, లక్ష్మీపూర్ తండాలో దాదాపు 200 ఓట్లు ఉంటే తనకు 195 మంది ఓటేసినందుకు వారందరికీ రుణపడి ఉంటానన్నారు. సీఎం రేవంత్రెడ్డి నిజాయితీ గల మోసగాడని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలో ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ, పెంచుతామన్న రైతుబంధు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లే మొట్టమొదటి వ్యక్తి రేవంత్రెడ్డి అని, ఆయన మరో ఏక్నాథ్ షిండేనని అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే పరోక్షంగా బీజేపీకి వేసినట్లు అవుతుందని, బీఆర్ఎస్కు వేసి వినోద్కుమార్ను గెలిపించాలని కోరారు. ఎంపీ బండి సంజయ్ కరీంనగర్కు గుదిబండగా మారాడని విమర్శించారు.
ఇటీవల ముస్తాబాద్ పర్యటనలో రామలక్ష్మణపల్లికి చెందిన రైతులు నీటి కష్టాలపై విన్నవించారని గుర్తు చేశారు. ఎగువమానేరుపై నిర్మించిన 11 చెక్డ్యాంలలో నీటి నిలువలు తగ్గుతున్నాయని, భవిష్యత్తులో కరువుచాయలు కనిపిస్తున్నాయని రైతులు ఆవేదన చెందారని గుర్తుచేశారు. మానేరు నీటిని విడిచి చెక్డ్యాంలను నిం పితే భూగర్భ జలాలు పెరుగుతాయని తనను కోరినట్లు వివరించారు.
గతేడాది వానకాలం 14 శాతం అధిక వర్షపాతం నమోదైనా రేవంత్ సర్కార్ కావాలనే రైతులపై కక్షగట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మేడిగడ్డ అపవాదు మోపుతున్నారని మండిపడ్డారు. మూడు నెలలైనా మేడిగడ్డ మూడు పిల్లర్లను రిపేర్ చేయించే తెలివి లేని సీఎం రేవంత్రెడ్డి అని ఎద్దేవా చేశారు. కేసీఆర్పై కోపంతో రైతులకు నష్టం చేస్తున్నారని అన్నారు. తన పర్యటనలో రైతులంతా నీటి కోసం బాధపడుతున్నారని తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో గంభీరావుపేట మండలం సమగ్రంగా అభివృద్ధి చెందిందని కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేజీ టూ పీజీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల వాసుల చిరకాల కోరిక అయిన లింగన్నపేట-గంభీరావుపేట వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. గోదావరి జలాలను కూడవెళ్లి వాగు ద్వారా నింపి మండుటెండల్లో మత్తడి దూకించిన ఘనత కేసీఆర్కే చెల్లుతుందని చెప్పారు. ఎడారిలా మారిన ఎగువమానేరుకు జీవం పోసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. అందుకే కేసీఆర్కు ఓటేయాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను మంజూరు చేసిన అభివృద్ధి పనుల్లో కాంగ్రెస్ నేతలు కమీషన్లకు కక్కుర్తి పడి పనులు నిలిపేస్తే వారి భరతం పడుతామని కేటీఆర్ హెచ్చరించారు. గంభీరావుపేట-లింగన్నపేట వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా పని నిలిచిపోయిందని, మండల కేంద్రంలో రోడ్ల విస్తరణ పనులు ఆగిపోయాయని వివరించారు.
ఈ నెల 12న కరీంనగర్లో జరిగే కదనభేరి సభను సూపర్ హిట్ చేద్దామని కేటీఆర్ కోరారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు అధికసంఖ్యలో తరలిరావాలన్నారు. సభను విఫలం చేయాలని సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని, కరీంనగర్ సభ రోజే హైదరాబాద్లో నిర్వహించే మహిళా సంఘాల సమావేశానికి బస్సుల్లో మహిళలను తరలిస్తున్నారని పేర్కొన్నారు. అయినా, మనకు ప్రైవేటు బస్సులు లభించాయని, గ్రామాల వారీగా విభజించుకొని అత్యధిక సంఖ్యలో సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
పార్టీ మండలాధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాజీ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర డైరెక్టర్ సుమలతా శర్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, దరువు ఎల్లన్న, ఎంపీపీ కరుణ, జడ్పీటీసీ విజయలక్ష్మి, సెస్డైరెక్టర్ నారాయణరావు, జడ్పీ కోఅప్షన్ హైమద్, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్రెడ్డి, లింగన్నగారి దయాకర్రావు, కమ్మరి రాజారాం, గోగు లింగంయాదవ్, ధ్యానబోయిన రాజేందర్, గంద్యాడపు రాజు, ఎర్ర రామాంజనేయగౌడ్, లతారెడ్డి, హన్మంతరెడ్డి, వెంకట్యాదవ్, కమలాకర్రెడ్డి, చెవుల మల్లేశం, సింగారపు నాగరాజుగౌడ్, శ్రీకాంత్రెడ్డి, శేఖర్గౌడ్, సుధాకర్శర్మ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజేందర్ పాల్గొన్నారు.
2001 నుంచి నేటి వరకు ప్రజల పక్షాన నిలిచింది, అన్నింటా అండగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. ఎవరు అధికారంలో ఉన్నా మనల్ని ఏమీ చేయలేరు. మీకు కేసీఆర్, కేటీఆర్తో పాటు గులాబీ సైన్యం వెన్నంటి ఉన్నది. ప్రజా సమస్యలపై ఏ మాత్రం అవగాహన లేని పార్టీల తరపున అభ్యర్థులు వచ్చి పోటీ చేస్తున్నరు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే మాజీ ఎంపీ వినోద్కుమార్ పార్లమెంట్లో గళమెత్తి ఎన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేశారో..? గుర్తించాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఎంపీ బండి సంజయ్ నిధులు ఎందుకు తేలేదు. అందరూ ఒకసారి ఆలోచించాలి. వినోద్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం.
– కొండూరి రవీందర్రావు, నాఫ్స్కాబ్ చైర్మన్
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో గత పదేళ్లలో అన్నింటా జరిగిన అభివృద్ధిని ఒకసారి ప్రజలకు వివరిస్తూ కరీనంగర్ ఎంపీగా బీ వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. కేటీఆర్ సహకారంతో సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసుకున్నాం. మెరుగైన విద్య, వైద్య, సాగు నీరు, రోడ్లు తదితర వసతులపై ప్రజలకు ఒకసారి గుర్తు చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దెర హామీలను నమ్మవద్దు. రైతుబంధు, రుణ మాఫీ, కల్యాణ లక్ష్మి తదితర నగదు పథకాల హామీలు అమలు చేయకపోవడంపై నిలదీద్దాం. గతంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన వినోద్కుమార్ విజయానికి పట్టం కడుదాం.
– న్యాలకొండ అరుణ, జడ్పీ చైర్పర్సన్. రాజన్న సిరిసిల్ల
రాష్ట్ర సాధనలో ముందున్న, కీలకంగా వ్యవహరించిన వినోద్కుమార్ను ఎంపీగా అందరం ఒక్కటై భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. రాష్ట్ర సమస్యలపై అవగాహన ఉండి గతంలో ఎంపీగా పార్లమెంటులో అత్యధిక ప్రశ్నలు అడిగిన మన నాయకులు వినోద్కుమార్. కేటీఆర్ సారథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వినోద్కుమార్కు భారీ మెజార్టీ అందిద్దాం. సక్సెస్ అనేది ఇక్కడి నుంచే చూపిద్దాం.
– తోట ఆగయ్య. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి గతంలో ఎంపీగా వినోద్కుమార్ చేసిన ప్రగతిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించాలి. ఎంపీ వినోద్కుమార్ గెలిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. సిరిసిల్ల ఎమ్మెల్యే మన కేటీఆర్. అలాగే ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించుకున్నట్లయితే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.
– చిక్కాల రామారావు, సెస్ చైర్మన్, సిరిసిల్ల