జగిత్యాల/జగిత్యాలరూరల్/మేడిపల్లి/ కథలాపూర్/ డిసెంబర్ 3: సీఎం కేసీఆర్ ఈ నెల 7న జగిత్యాల పర్యటనకు జిల్లాలో సర్వం సిద్ధమవుతున్నది. ఓ వైపు అధికార యంత్రాంగం, మరోవైపు టీఆర్ఎస్ నాయకత్వం పర్యవేక్షిస్తున్నది. జగిత్యాల సమీకృత కలెక్టరేట్కు ప్రారంభోత్సవం, మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి ప్రారంభోత్సవం, అనంతరం మోతె శివారులో బహిరంగ సభ నిర్వహించనుండగా ఏర్పాట్లు చేస్తున్నది.
పర్యటనలో భాగంగా జగిత్యాల అర్బన్ మండలంలోని మోతె గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా, సభా స్థలాన్ని శనివారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ పరిశీలించారు. అలాగే సమీకృత కలెక్టరేట్ను కలెక్టర్ రవి, ఎస్పీ సింధూ శర్మ, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు.
ఎలాంటి లోటు పాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూ చించారు. భద్రతా పరంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎస్పీ పోలీస్ అధికారులకు సూచించా రు. అనంతరం మెడికల్ కళాశాలకు భూమిపూజ ఏర్పాట్లను ఇరువురు పరిశీలించారు. భూమిపూజ చేస్తున్న ప్రాంతాన్ని శనివారంలోగా సిద్ధ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీఓ మాధురి, డీఎస్పీ ప్రకాశ్ ఉన్నారు.