మెట్పల్లి, డిసెంబర్ 4: తన జీవితాంతం బీఆర్ఎస్తోనే ఉంటానని, భవిష్యత్లోనూ పార్టీ మారే ప్రసక్తే ఉండదని కోరుట్ల ఎమ్మెల్యే డా కల్వకుంట్ల సంజయ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజలు ఇచ్చే తీర్పును ఎవరైనా స్వీకరించాలని చెప్పా రు. అధికారంలో లేకున్నా ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై పోరాడుతానని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు తప్ప శత్రువులు ఉండకూడదని, నియోజవకర్గాన్ని కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకుందామని, తనతో కలిసిరావాలని రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. మెట్పల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడం బాధగానే ఉందని, తొమ్మిదిన్నర ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచిందన్నారు. కోరుట్ల గడ్డ బీఆర్ఎస్ జెండా అని, 2009 నుంచి నాలుగు సార్లు తన తండ్రి విద్యాసాగర్రావును, ఐదోసారి తనను నియోజకవర్గ ప్రజ లు ఆదరించి గెలిపించారన్నారు. స్థానికేతరులకు అవకాశం ఇవ్వకుండా మన బిడ్డనే ఎమ్మెల్యేగా ఉండాలని తనను ఆశీర్వదించారని, వారి నమ్మకాన్ని నిలబెడతానని, ఆకాంక్షలను నెరవేరుస్తానని పేర్కొన్నారు. కేసీఆర్ స్ఫూర్తితో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని, నియోజకవర్గానికి రావాల్సిన నిధులను ప్రభుత్వం నుంచి పోరాడి సాధిస్తానన్నారు.
వైద్య వృత్తి నుంచి తాను రాజకీయాల్లోకి వచ్చానని, వంద శాతం నిజాయితీగా పని చేస్తామనన్నారు. అందరినీ కలుపుకొని అభివృద్ధిలో నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతానన్నారు. ప్రజా సేవలో వైద్యం కూడా ఒక భాగమేనని, వైద్య సేవలు కూడా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రైతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో పాటు విద్యా, వైద్యం, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తానని పేర్కొన్నారు. తన గెలుపునకు సహకారం అందించిన నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖర్రావు, పాల్గొన్నారు.