మారుతీనగర్, నవంబర్ 21: ‘కాంగ్రెస్, బీజేపీలు రెండూ రెండే. వారి పాలన దరిద్రం. ఏండ్ల కొద్ది పాలించి కాంగ్రెస్ చేసిందేమీ లేదు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఒరిగిందేమీ లేదు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్నీ అబద్ధాలు చెబుతున్నరు. ఫేక్ హామీలిస్తున్నరు. నమ్మితే మునుగుతరని.. జాగ్రత్త అని’ కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రజలకు సూచించారు. మంగళవారం మెట్పల్లి పట్టణంలోని పలువార్డుల్లో రోడ్ షో నిర్వహించి చావిడి, బస్డిపో, గోల్ హనుమాన్ చౌరస్తాల వద్ద కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వార్డుల కౌన్సిలర్లు సంజయ్ కల్వకుంట్లతో పాటు ఎమ్మెల్యే విద్యాసాగర్రావును సత్కరించారు.
ఈ సందర్భంగా సంజయ్ కల్వకుంట్ల మాట్లాడారు. ఎన్నికలు వచ్చినయంటే చాలు కాంగ్రెస్, బీజేపీ వాళ్లు వచ్చి, మాయ మాటలు చెప్పి మోసం చేస్తారని వారిని నమ్మద్దని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం, ఆడబిడ్డలకు చేసిన మేలును చూసి ఆలోచించి ఓటేయాలని కోరారు. ‘మీకు స్థానికంగా ఉండే నేను కావాలా..? హైదరాబాద్, నిజమాబాద్లో ఉండే స్థానికేతరులు కావాలా..? ఆలోచించుకోవాలని’ సూచించారు. బీజేపీ నాయకుడు ఎంపీగా గెలిచిన ఐదేండ్లలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, కులాల, మతాల పేరుతో ఐకమత్యంగా ఉన్న వారిలో చిచ్చు పెడుతూ స్వార్థరాజకీయాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్కు 11 సార్లు అవకాశం ఇస్తే తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రైతులను ఏనాడూ పట్టించుకోని ఆ పార్టీ, ఏ మొఖం పెట్టుకొని ఇప్పుడు ఓట్లు అడుగుతున్నదని ప్రశ్నించారు. మహిళల కోసం బీఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, బీడీ కార్మికులకు ఎలాంటి కటాఫ్ డేట్ లేకుండా పింఛన్ అందజేస్తామని చెప్పారు. తన తండ్రి పట్టణానికి చేసిన అభివృద్ధిని చూసి తనను ఆశీర్వదిస్తే అండగా ఉండి సేవలందిస్తానని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, మున్సిపల్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్రావు పాల్గొన్నారు.
అభివృద్ధి అంటే తెలియని ప్రతిపక్షాలు:ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
అభివృద్ధి, సంక్షేమంలో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపారని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కొనియాడారు. అభివృద్ధి అంటే తెలియని కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయ మాటలు నమ్మితే మోసపోతరని, నాటి రోజులు గుర్తు చేసుకోవాలని సూచించారు. స్వరాష్ట్రంలో పేదలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్కు మరోసారి మద్దతు పలుకాలని, పనిచేసే ప్రభుత్వానికే అవకాశం ఇవ్వాలని కోరారు. తనను ఆదరించినట్లుగానే తన కుమారుడిని ఆదరించి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.